పంచ ప్రయాగలు

పంచ ప్రయాగలు
ప్రయాగ అంటే సంగమం. నదులు సంగంమించే పవిత్ర స్థలం. అంటే నదులు లేక నీటి ప్రవాహాలు, ఒకదానితో మరొకటి కలిసిపోయే ప్రదేశం అని అర్థం. కేదార్ నాథ్, బదరీ నాథ్ వెళ్లే మార్గంలో పంచప్రయాగలు అని చెప్పబడే అయిదు పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి. అని విష్ణు ప్రయాగ, నంద ప్రయాగ, కర్ణ ప్రయాగ, రుద్ర ప్రయాగ, దేవ ప్రయాగ ఈ ఐదింటిని కలిపి పంచప్రయాగలు అని పిలుస్తారు. ఈ క్షేత్రాలు మోక్షప్రదాలనని నమ్మకం.

విష్ణు ప్రయాగ :-
బదరీనాథ్ నుండి దక్షిణంగా 38 కి.మీ., దూరంలో విష్ణు ప్రయాగ ఉన్నది. విష్ణు ప్రయాగకు తూర్పుగా కొంతదూరంలో ‘నితి’ అనే లోయ ప్రదేశం ఉంది. ఆ లోయలో ఉన్న కొండశిఖరాల మీద నుండి వాలుగా జారపడిన నీరు, ఒక నదీ ప్రవాహంగా మారి దౌలి గంగ (ధవళ గంగ) అనే పేరుతో పడమటి దిక్కుగా ప్రవహిస్తూ వచ్చి విష్ణు ప్రయాగ దగ్గర అలకనంద నదిలో కలిసిపోతుంది. విష్ణుమూర్థి వీర నారాయణ రూపం ధరించి, తపస్సు చేయడానికి బదరికావనం వెళుతూ, ఈ సంగమం దగ్గర కొంతకాలం ఉండి, తపస్సు చేశాడట. అందువల్ల ఈ పవిత్ర ప్రదేశానికి విష్ణు ప్రయాగ అనే పేరు వచ్చింది. ఇక్కడ ఒక పురాతన ఆలయం ఉంది. అందులోని దైవం శ్రీ మహావిష్ణువు.

నంద ప్రయాగ:-
బదరీనాథ్ నుండి సుమారు 106 కి.మీ., దక్షిణ భాగాన నంద ప్రయాగ ఉన్నది. ఇక్కడకు ఈశాన్యంగా సుమారు 75 కి.మీ దూరంలో నందాదేవి పర్వత శిఖరం ఉన్నది. ఆ శిఖరం చుట్టూ ఉన్న పర్వతాల మధ్య, ఒక మంచులోయ ఉన్నది. ఆ లోయలో నుండి, నందాకిని అనే చిన్ననది పడమటి దిక్కుగా ప్రవహిస్తూ వచ్చి, అలకనంద నదిలో కలుస్తుంది. నందాదేవి శిఖర ప్రాంతంలో జన్మించిన కారణంగా దీని పేరు నందాకిని  అని పిలవబడుతుంది. ఈ నది పేరు మీద ఈ సంగమ ప్రదేశం నంద ప్రయాగగా ప్రసిద్ధి చెందింది. పూర్వం నందుడు అనే ఒక చక్రవర్తి ఈ పవిత్ర సంగమం దగ్గర గొప్ప యజ్ఞాన్ని నిర్వహింపజేశాడట. అందుచేత ఆయన పేరు మీద ఈ ప్రదేశానికి నందప్రయాగ అనే పేరు వచ్చిందని మరొక ఐతిహ్యం ద్వారా తెలిస్తుంది.

కర్ణ ప్రయాగ:-
నంద ప్రయాగ తర్వాత అలకనంద నది యొక్క దిశ కొంత నైఋతి దిక్కుగా మారుతుంది. నంద ప్రయాగ తర్వాత సుమారు 22 కి.మీ., దూరంలో, అంటే బదరీనాథ్ నుండి 128 కి.మీ., దూరంలో కర్ణ ప్రయాగ ఉన్నది. ఇక్కడ నుండి తూర్పుగా సుమారు 100 కి.మీ., దూరంలో ఉన్న ఒక మంచు లోయలో నుండి ‘పిడరగంగ’ అనే నది ప్రవహిస్తూ వచ్చి, ఆ అలకనంద నదిలో కలుస్తుంది. ఈ రెండు నదుల సంగమం వద్ద మహాభారత కథలోని కర్ణుడు సూర్యభగవానుని గూర్చి గొప్ప తపస్సు చేసి, ఆయన నుండి కవచకుండలాలు పొందాడని స్థలపురాణం. ఆ కారణంగా ఈ సంగమానికి కర్ణ ప్రయాగ అనే పేరు వచ్చింది అంటారు. ఇచ్చటనే ఉమాదేవి అనే చక్కని ఆలయం ఉన్నది. భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తారు.

రుద్ర ప్రయాగ:-
కర్ణ ప్రయాగ నుండి సుమారు 31 కి.మీ., నైఋతి దిశగా, అంటే బదరీనాథ్ నుండి 159 కి.మీ., దూరంలో రుద్ర ప్రయాగ ఉన్నది. హరిద్వార్ – ఋషికేష్ ల నుండి వచ్చిన మార్గం రుద్రప్రయాగ దగ్గర రెండుగా చీలి, ఒక మార్గం కేదార్ నాథ్ వైపుకు, మరొకటి బదరీనాథ్ వైపుకు సాగిపోతాయి. కేదార్ నాథ్ వద్ద ఉన్న కొండలలో జన్మించిన మందాకిని నది, దక్షిణంగా ప్రవహిస్తూ వచ్చి ఈ రుద్రప్రయాగ దగ్గర అలకనంద నదిలో కలుస్తుంది. రుద్రప్రయాగ తర్వాత మందాకిని నది ఉనికి ఉండదు అనే చేప్పాలి. కేవలం మందాకిని నదితో కలిసిన అలకనంద మాత్రమే ముందుకు సాగిపోతుంది. ఈ రుద్రప్రయాగలో నారద మహర్షి కొంతకాలం తపస్సు చేశాడని స్థలపురాణం చెబుతుంది. ఈ ఊరిలో చాలా పురాతన కాలం నాటి జగదాంబ దేవి అనే అమ్మవారి ఆలయమూ, రుద్రనాథ్ అనే శివాలయం ఉన్నాయి. ఈ స్వామిపేరున ఈ ఊరు రుద్రప్రయాగ అని ప్రసుద్ధి చెందింది.

దేవ ప్రయాగ:- 
ఉత్రాఖాండ్ లో టేహ్రీగర్వాల్ జిల్లాలో సముద్రమట్టానికి 2723 అడిగుల ఎత్తులో ఉన్న ఒక ప్రసిద్ధ పట్టణం దేవప్రయాగ. ఉత్తరాంచల్ రాష్ట్రంలోని హృషికేష్ నుండి 70 కి.మీ., దూరంలో బదరీనాథ్ వెళ్లుదారిలో ఈ క్షేత్రం ఉంది. ఈ పట్టణానికి ఇక్కడ నివసించిన ఒక ప్రఖ్యాత హిందూ యోగి దేవ్ శర్మ పేరు పెట్టారు. 108 దివ్యతిరుపతులలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో కేదారీనాథ్ లో పుట్టిన మందాకినీ నది, బదరీనాథ్, కొండల్లో పుట్టిన అలకనందా నది, గంగోత్రిలో పుట్టిన గంగానది మూడు నదులు ఇచ్చట కలుసుకుంటాయి. త్రివేణి సంగమంగా పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రం శ్రాద్ధకర్మలకు ప్రసిద్ధి చెందినది. బ్రహ్మచర్య వ్రతంతో నాలుగు నెలల కాలం ఇక్కడ అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తే మోక్షప్రాప్తి కల్గుతుందని శివుడు నారదునితో చెప్పినట్లు స్కాంధపురాణం వివరిస్తుంది. ఈ దేవ ప్రయాగ దగ్గర, గంగోత్రి నుండి వచ్చిన భాగీరథీ నది గంగానదిలో కలిసిపోతుంది. దేవ ప్రయాగ తర్వాత ఉండే ప్రవాహం గంగానది అనే పేరుతో పిలవబడుతుంది. అటు భాగీరథి, ఇటు అలకనంద నదులు ఈ రెండు తమ ఉనికని ఈ దేవ ప్రయాగతో కోల్పోతాయి. దేవ ప్రయాగ ఊరు కొండ ఏటవాలులో, వరుసలుగా మెట్లు మెట్లుగా ఉంటుంది. పురాణాల ప్రకారం, ఇక్కడ శ్రీరాముడు మరియు అతని తండ్రియైన దశరథ మహారాజు ఇక్కడే తపస్సు చేశారు. పాండవులు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి ఈ నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించారని ప్రతీతి. ఇచ్చట సీతారాముల ఆలయం ఉంది. భక్తులు స్వామిని “రఘునాథ్ జీ” గా కొలుస్తారు. ఈ ఆలయానికి వెనకవైపున హనుమాన్ ఆలయం కూడా ఉన్నది. ప్రధాన దేవాలయంలోని “నీలమేఘ పెరుమాళ్” ఆనాడు భరద్వాజ మహర్షికి ప్రత్యక్షమైనట్లు, స్వామిని పెరియాళ్వార్, తిరుమంగై ఆళ్వార్ కీర్తించినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తుంది.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: