శాకంబరి
వేదాంతము ద్వారా తెలియబడే దానివి, సాక్షాత్తు పరబ్రహ్మానివి అయిన నీకు వందనాలు. సకల జగత్తును నీ మాయ చేత సృష్టిస్తావు. భక్తుల పాలిటి కల్పవల్లివి, కల్పవృక్షానివి, కోరిన కోరికలు తీర్చేదానివి. భక్తుల కోసమే నీవు ఒక రుపాన్ని ధరిస్తావు/పొందుతావు. అటువంటి నీకు శిరస్సువంచి నమస్కరిస్తున్నాం తల్లీ.
నిత్యం అనంతమైన తృప్తితో ఉండేదానివి, ఎవరుతోనూ పోల్చదగినదానివి కావు, సమస్త భూవనాలకు ఈశ్వరివైన నీకు మా నమస్కారములు. సహస్ర (అనంతమైన) కన్నులు కలిగినరూపంతో వ్యక్తమై లోకాలకు శాంతిని పంచావు. అందువల్ల నీవు 'శతాక్షీ దేవి'గా పిలువబడుతావు. ఆకలితో పీడింపబడుతున్న మాకు ఇంక నిన్ను స్తుతించే శక్తి లేదు తల్లీ.
అమ్మా మా యందు కృప చూపించి వేదములను తిరిగి మాకు ప్రసాదించు అని దేవతలు, జనులు మహేశ్వరిని వేడుకున్నారు.
వ్యాసుడు జనమేజయుడుతో "ఓ రాజా! ఈ మాటలు వినగానే అమ్మ తన చేతిలో ధరించిన రుచికరమైన కూరగాయలు, పండ్లను జనులకు ఇచ్చింది. ఆ పరమేశ్వరి.......... బ్రహ్మ దేవుడు మొదలు చిన్న కిటకముల వరకు అందరికి తల్లి కదా. అందువల్ల జనులతో పాటు ఇతర జీవుల ఆకలిని కూడా తీర్చింది. జంతువులకు, పక్షులకు వాటికి సరిపడా ఆహారాలను అందించింది.
ప్రార్ధనలు చేయగానే కరుణించి మంచి రసకరమైన, పుష్టికరమైన కూరగాయాలను, పండ్లను అందరికి ప్రసాదించింది కనుక ఆ రోజు నుంచి 'శాకంబరి' / 'శాకంభరి' అనే పేరుతో ప్రపంచంలో ప్రసిద్ధి పొందింది. శాకంబరీ దేవి ఆహారానికి, ప్రకృతికి ప్రతిరూపం. శాకములంటే కూరలని అర్ధం. శాకంభరి హరితజీవనానికి ప్రతీక. స్తోత్రాలే కాక, ఆహారాన్ని, కాయగూరలు, పండ్లను వృధా చేయకపోవటం, సద్వినియోగం చేయటం, అమ్మ కన్నీటి నుంచి వచ్చినాయి కనుక నీటిని వృధా చేయకుండా ఉండటం, ప్రకృతిని రక్షించడం, ప్రకృతికి పుష్టి కలిగించే పనులు చేయటం కూడా శాకంభరి దేవికి చేసే ఆరాధనయే అవుతుంది.
Comments
Post a Comment