శ్రీ మహాభారతంలో చిన్ని కథలు:


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

                 శ్రీ మహాభారతం
                    ➖➖➖✍️
                   95వ భాగము
    శ్రీ మహాభారతంలో చిన్ని కథలు

                *కలియుగ ధర్మం:*
                      ▪️〰️▪️

ధర్మరాజు కలియుగంలో కలిగే ధర్మహాని గురించి వివరించమని మార్కండేయ మహర్షిని అడిగాడు.

మార్కండేయ మహర్షి.. ”ధర్మనందనా! కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుంది, త్రేతాయుగంలో మూడుపాదాలతో నడుస్తుంది, ద్వాపరయుగంలో రెండు పాదాలతో నడుస్తుంది. కలియుగంలో ఒక్క పాదంతో నడుస్తుంది. ధర్మం క్షీణిస్తుంది. అధర్మం రాజ్యమేలుతుంది. నరులు సత్యం చెప్పరు. మానవుల ఆయుష్షు క్షీణిస్తుంది, విద్యలు క్షీణిస్తాయి. విద్యా హీనత వలన మోహం కలుగుతుంది. మోహము వలన లోభము, లోభము వలన కామము, కామము వలన క్రోధం, క్రోధం వలన వైరం ఇలా ఒక దాని వెంట ఒకటి వస్తుంది. వైరం వలన వర్ణ బేధం కలుగుతుంది. వర్ణ బేధము వలన వర్ణసంకరం జరుగుతుంది. హింస ప్రబలుతుంది. బ్రాహ్మణుడు తన ధర్మాలైన జపము, తపము, నియమము, స్వాధ్యాయము విడుస్తారు. శూద్రులు తపస్సు చేస్తారు. జనపదాలు కౄరమృగాలతో నిండి పోతాయి. అరాచకం ప్రబలుతుంది. రాజులు దుష్టులౌతారు. రాజ్యాధికారం నశిస్తుంది. క్షత్రియులు తమ ధర్మాలైన క్షాత్రము, తేజము, శౌర్యము విడిచి పెట్టి సేవకా వృత్తి అవలంభిస్తారు. పంటలు సరిగా పండవు. చెట్లకు, కాయలు, పూలు, పండ్లు సరిగా కాయవు. బ్రాహ్మణుడు తన ధర్మాన్ని వదిలి వ్యాపారం, వ్యవసాయం చేస్తాడు. నాస్తికులు ప్రబల మౌతారు. దేహ సంరక్షణయే ప్రధానము అనుకుంటారు. పాపం, పుణ్యమూ అనే మాటలకు విలువ ఉండదు. వానలు సకాలంలో కురవవు. విత్తనాలు తాలుగా ఉంటాయి. కొనుగోలు అమ్మకాలు మోసపూరితమౌతాయి. తాకట్టుగా పెట్టిన ఆభరణాలు అపహరిస్తారు. సాధు చరితులు, సజ్జనులు రోగపీడితులౌతారు. అధర్మ వర్తనులు దీర్గాయువులై భోగభాగ్యాలు అనుభవిస్తారు. పనికిరాని పంటలు ఎక్కువ ఔతాయి. మానవులలో వివాహేతర సంబంధాలు ఎక్కువ ఔతాయి. పితృ కార్యాలలో అర్పించిన పిండములు ఒకరివి మరొకరు తింటారు. దైవకార్యాలు పితృకార్యాలు కాలానుగుణంగా జరగవు. బ్రాహ్మణులు హేతువాదులౌతారు. వేదాలను నిందిస్తూ పూజలు వ్రతములు విడనాడి దుర్మార్గులు ఔతారు. బంధువులను, దీనులను, దుర్భలులను, దీనులను మోసగించి వారి ఆస్తులను అపహరిస్తారు. తల్లి తండ్రులను, కన్నపిల్లలను చంపు వారిని, విచ్చలవిడిగా ప్రవర్తించు వారిని ప్రజలు పూజిస్తారు. వారి ధనానికి ఆశపడి బ్రాహ్మణులు వారిని ఆశ్రయిస్తారు. ప్రజలను రక్షించి భూమి పాలించ వలసిన ప్రభువు వారి ధనాన్ని దోచుకుంటాడు. స్త్రీలను, ధనాన్ని, భూములను హరిస్తారు. రాజులు వారిలో వారు కలహించి యుద్ధాలు చేసుకుంటారు. అందువలన ప్రజా క్షయం ఔతుంది. కొడుకులు తండ్రులను అవమానిస్తారు. భార్యలు భర్తను అవమానిస్తారు. భార్యాభర్తలు పరస్పరం కలహిస్తారు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తారు. దేవకార్యం, పితృకార్యం నడవవు. వేదాధ్యయనం అంతరిస్తుంది. ఈ భూమి మొత్తం దుర్జనులతో నిండి పోతుంది. పదహారు ఏండ్లకే నూరేళ్ళు నిండుతాయి. ఏడెనిమిదేళ్ళకే స్త్రీలు సంతానవతులౌతారు. దానం చేసే వాళ్ళు ఉండరు. ప్రజలు ఒకరిని ఒకరు దోచుకుంటారు. అన్నీ తెలిసిన జ్ఞానులు సైతం అధర్మంగా ప్రవర్తిస్తారు. అన్నాన్ని ధనం కోసం అమ్ముకుంటారు. బ్రాహ్మణులు వేదాన్ని అమ్ముకుంటారు. స్త్రీలు మానాన్ని ధనానికి అమ్ముకుంటారు. శూద్రులు అత్యంత బలవంతులై ఇతరులను సంహరిస్తారు. బ్రాహ్మణులు దిక్కు తోచక నాలుగు దిక్కులకు పారిపోతారు. దోపిడీదారులు, దొంగలూ ప్రజల ధన, ప్రాణాలను దోచుకుంటారు. ప్రజలు అడవులలో తలదాచుకుంటారు. శూద్రులు వేదాంతవిషయాలు వివరిస్తుంటే బ్రాహ్మణులు వింటుంటారు. బ్రాహ్మణులు ధైర్యం వీడి శూద్రులకు సేవకులై చేయరాని పనులు చేస్తారు. కలియుగంలో దేవాలయాలు, పవిత్రమైన ఆశ్రమాలు, బ్రాహ్మణ గృహాలు పాడై పోతాయి. అడవులను ధ్వంసం చేస్తారు. వ్యభిచారం, మద్యపానం ప్రబలి పోతాయి. శిష్యుడు గురువును లక్ష్యపెట్టడు. గురువు శిష్యుడిని మోసం చేస్తాడు. కరవు కాటకాలు ఏర్పడతాయి. ప్రజలలో భయం ఏర్పడుతుంది. కలియుగంలో క్రమంగా ధర్మం క్షీణించి అధర్మం వర్ధిల్లుతుంది.

కల్కి అవతారము:
ఇలా కలియుగం ఆఖరి దశకు చేరగానే శంబళ గ్రామంలో కల్కి అవతరిస్తాడు. అతని పేరు విష్ణుయశుడు. అతనికి సంస్మరణ చేతనే సకల వేదాలు, శాస్త్రాలు అవగతమౌతాయి. అతను సార్వభౌముడౌతాడు. అతడు అధర్మవర్తనులను సంహరించి ధర్మం నిలబెడతాడు. ఆ పై అశ్వమేధయాగం చేస్తాడు. అతను నిలిపిన ధర్మం అనుసరించి బ్రాహ్మణులు తమ ధర్మం నిర్వర్తిస్తారు. 

కృతయుగం ఆరంభమౌతుంది. ధర్మం నాలుగు పాదాల విలసిల్లుతుంది. దేవాలయాలు ఆశ్రమాలు పూర్వవైభవం సంతరించుకుంటాయి. సకాలంలో వానలు కురుస్తాయి. పంటలు సమృద్ధిగా పండుతాయి. ప్రజల ఆయుష్షు వృద్ధి చెందుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. తిరిగి కాలచక్రం మొదలౌతుంది. 

కనుక ధర్మనందనా ! నీవు బ్రాహ్మణులను అవమానించకు వారికి ఇష్టం వచ్చినవి చేయుము. సమస్త భూతముల యందు దయకలిగి ఉండు. ప్రజలను కన్నబిడ్డలవలె పాలించు. పాపాత్ములను శిక్షించు. అజ్ఞానం ప్రబలకుండా చూడు. అహంకారం వదిలి పెట్టు. ఎల్లప్పుడూ సత్యమే చెప్పు. నీవు భరతవంశ సంజాతుడవు నీకు అన్నీ తెలుసు. ప్రాజ్ఞుడవు నీకు చెప్పవలసిన పని లేదు!” అన్నాడు. 

ధర్మరాజు... “మహాత్మా! మీరు ఆనతిచ్చిన ప్రకారం నేను లోభం, మత్సరం లేకుండా ప్రవర్తిస్తాను. ధర్మం ఆచరిస్తాను!” అన్నాడు✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

                  శ్రీ మహాభారతం 
                     ➖➖➖✍️
                    96 వ భాగము
    శ్రీ మహాభారతంలో చిన్ని కథలు:

            పరీక్షిత్తు వృత్తాంతము:
                        ▪️〰️▪️

ధర్మరాజు… “మహర్షీ ! బ్రాహ్మణ ప్రభావం గురించి వివరించడి.” అని అడిగాడు.

మార్కండేయుడు… “పూర్వకాలంలో పరీక్షిత్తు అనే రాజు అయోధ్యను పాలిస్తుండేవాడు. ఆ రాజు అడవిలో వేటాడుతూ ఒక సుందరిని చూసి మోహించి ‘ఓ సుందరీ! నీ వెవరు? ఈ అడవిలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు?’ అని అడిగాడు. అందుకు ఆ యువతి… ‘నేను అవివాహితను. తగిన వరుని కోసం వెతుకుతున్నాను.’ అన్నది.
అందుకు ఆ రాజు తనను వివాహమాడమని కోరాడు. అందుకు ఆమె అంగీకరించింది. కాని తనను జలవిహారానికి ఎప్పుడూ తీసుకు వెళ్ళకూడదని కోరింది. అందుకు అంగీకరించి ఆమెను వివాహమాడి రాజధానికి తీసుకు వెళ్ళాడు. ఒకరోజు వారు ఉద్యానవనంలో విహరిస్తున్న సమయంలో రాజు కొలనులో స్నానం చేస్తూ ఆమెను కూడా పిలిచాడు. ఆమె అలాగే కొలనులో దిగి అదృశ్యం అయింది. వెంటనే రాజు భటులను పిలిచి ఆ కొలనులోని నీటిని బయటకు పోయించాడు. కొలను అడుగున అసంఖ్యాకంగా కప్పలు ఉన్నాయి. ఆ కప్పలే తన భార్యను మాయం చేసి ఉంటాయని భావించాడు. వెంటనే లోకంలోని కప్పలన్నిటినీ నాశనం చెయ్యమని ఆజ్ఞాపించాడు. సేవకులు రాజు చెప్పినట్లే కప్పలను వెతి వెతికి చంపడం మొదలు పెట్టారు. కప్పల నాయకుడు ఒక మహర్షి రూపంలో రాజు వద్దకు వచ్చి కప్పలను చంపవద్దని అర్ధించాడు.

అందుకు రాజు ‘అవి నా ప్రేయసిని మింగేసాయి అందుకే చంపుతున్నాను’ అన్నాడు.
కప్పల నాయకుడు ‘మహారాజా! నేను కప్పల దొరను. ఆమె నా కూతురు. ఆమె నీ లాగే చాలా మందిని మోసం చేసింది.’ అన్నాడు.
పరీక్షిత్తు ‘ఐతే ఆమెను తెచ్చి నాకు అప్పగించు!’ అని రాజు చెప్పాడు. ఆ కప్పలదొర తన కూతురును అక్కడకు పిలిపించి ఆమెతో.. ‘ఎంతోమంది రాజులను మోసగించావు కనుక నీకు పుట్టే బిడ్డలు దుర్మార్గులు, మోసగాళ్ళు ఔతారు.’ అని శపించాడు.
తరువావత వారికి శలుడు, నలుడు, వలుడు అనే ముగ్గురు కుమారులు జన్మించారు. తరువాత ఆ రాజు శలునికి రాజ్యం అప్పగించి తపోవనాలకు వెళ్ళాడు.

వామదేవుడు:
ఒకరోజు శలుడు వేటకు వెళ్ళాడు. ఒక మృగం అతని బాణం దెబ్బ తిని పారిపోయింది. రాజు సారధితో ఆ మృగాన్ని వెంటాడమని చెప్పాడు. సారధి ‘రాజా ఆ మృగం చాలా వేగంగా పరుగెత్తింది. మనం ఎంత వేగంతో రధం నడిపినా దానిని చేరలేము. మన గుర్రాలు వామ్య జాతికి చెందినవి అయితేనే ఆ మృగాన్ని పట్టగలము. అలాంటి గుర్రాలు వామదేవుడు అనే మహర్షి దగ్గర ఉన్నాయి!’ అని అన్నాడు. వెంటనే ఆ రాజు వామదేవుని వద్దకు వెళ్ళి ‘మునీంద్రా! నేను ఒక మృగాన్ని కొట్టాను. అది దెబ్బతిని పారి పోయింది. ఆ మృగాన్ని పట్టుకోడానికి నీ అశ్వములను ఇవ్వు!’ అని అడిగాడు. వామదేవుడు ‘రాజా! ఆ గుర్రాలను తీసుకు వెళ్ళి నీపని కాగానే నాకు తిరిగి ఇవ్వు!’ అన్నాడు.  
అలాగే అని చెప్పి శలుడు ఆ అశ్వములను తీసుకు వెళ్ళి మృగాన్ని పట్టుకుని రాజధానికి వెళ్ళాడు. ఇంత వేగం కలిగిన గుర్రాలు రాజుల వద్ద ఉండాలి కాని ఆ మునికి వీటితో పని ఏమి? అనుకుని వాటిని తన వద్దనే ఉంచుకున్నాడు. ఎన్ని రోజులకూ రాజు తన గుర్రాలను తిరిగి ఇవ్వక పోవడంతో వామదేవుడు తన శిష్యుడు ఆత్రేయుడిని ఆ గుర్రాలను తీసుకు రమ్మని రాజు వద్దకు వెళ్ళాడు. ఆత్రేయుడు రాజు వద్దకు వెళ్ళి ‘రాజా! మీరు నా గురువుగారైన వామదేవుని దగ్గర ఉన్న అశ్వములను తీసుకుని తిరిగి ఇవ్వలేదు. వాటిని స్నేహపూర్వకంగా ఇస్తే నేను వాటిని తీసుకు వెళతాను,’ అన్నాడు. 
అందుకు శలుడు కోపించి ‘ఆయన పంపడం నీవు రావడం చాలాబాగుందిలే వెళ్ళు!’ అన్నాడు.

ఆ త్రేయుడు ఆ విషయం తన గురువుకు చెప్పాడు.

శలుడి గర్వభంగము:
వామదేవుడు ఆగ్రహించి రాజు వద్దకు వచ్చాడు. ‘రాజా! నీకు ఇది తగదు. నీవు అప్పుగా తీసుకున్న గుర్రాలను తిరిగి ఇవ్వు. నీ పని అయింది కదా. అప్పుగా తీసుకున్న సొమ్ము తిరిగి ఇవ్వక లోభంతో అలాగే ఉంచుకోవడం పాపం కదా. అలాంటి పాపం చేసిన వాళ్ళు నరకానికి పోతారు.’ అన్నాడు. 

శలుడు.. ‘అయ్యా ! విప్రులకు గుర్రాలు ఎందుకు? కావాలంటే రెండు ఎద్దులను ఇస్తాను తీసుకుపో. అవి నచ్చక పోతే కంచరగాడిదలను ఇస్తాను కానీ గుర్రాలను మాత్రం ఇవ్వను. ఊరికే ఆశలు పెట్టుకోవద్దు!’ అన్నాడు. 

వామదేవుడు.. ‘రాజా ఇది అధర్మం. విప్రుల సొమ్ము తీకుని ఇవ్వననడం, పాపం కాదా!’ అన్నాడు. 

శలుడికి కోం వచ్చింది. ‘ఈ బ్రాహ్మణుని పట్టి బంధించి శూలాలతో పొడిచి చంపండి!’ భటులకు ఆజ్ఞాపించాడు. 

వామ దేవుడికి కోపం వచ్చింది. అతని ముఖం నుండి ఎందరో రాక్షసులు పుట్టుకు వచ్చి రాజును భటులను చంపారు. శలుడు చనిపోయిన తరువాత నలుడు రాజయ్యాడు. వామదేవుడు నలుని దగ్గరకు వచ్చి.. ‘రాజా మీరు ధర్మ పరులు, నాగుర్రాలను నాకు ఇప్పించండి!’ అని అడిగాడు.

నలునికి కూడా కోపం వచ్చింది.. ‘ఈ బ్రాహ్మణుడిని చంపటానికి విషం పూసిన బాణం తెప్పించండి!’ అని భటులను ఆజ్ఞాపించాడు.

అందుకు వామదేవుడు నవ్వి.. ‘రాజా! అంతఃపురంలో ఉన్న నీ కుమారుని అది చంపగలదు జాగ్రత్త!’ అని హెచ్చరించాడు. 

అంతలో అంతఃపురం నుండి హాహాకారము చేస్తూ చనిపోయిన రాజకుమారుని తీసుకు వచ్చారు.

అది చూసి నలుడు కోపంతో ఒళ్ళు మరచి.. ‘అహంకారంతో మాట్లాడుతున్న ఈ బ్రాహ్మణుని నేనే సంహరిస్తాను.’ అని విల్లు ఎక్కు పెట్టాడు. కాని అతని రెండు చేతులు, విల్లు, బాణం స్తంభించి పోయాయి.

రాజుకు గర్వం దిగి పోయింది. ప్రజలను చూసి… ‘నా గర్వం అణిగి పోయింది బ్రాహ్మణశక్తి ముందు నా శక్తి పనికిరాదని తెలుసుకున్నాను, వామదేవుడికి నమస్కరిస్తున్నాను!’ అన్నాడు. 

వామదేవుడు ప్రసన్నమై రాజకుమారుని బ్రతికించి నలుని యధాస్థితికి తీసుకు వచ్చాడు.

నలుడు గుర్రాలను వామదేవుడికి తిరిగి ఇచ్చాడు. 

”ధర్మరాజా బ్రాహ్మణుల మహిమ అలాంటిది అని మార్కండేయుడు చెప్పాడు.”*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

               శ్రీ మహాభారతం
                  ➖➖➖✍️
                  97వ భాగము
   శ్రీ మహాభారతంలో చిన్ని కథలు:

              ఇంద్రద్యుమ్నుడు:
                    ▪️〰️▪️

ధర్మరాజు మార్కండేయునితో.. “అయ్యా మీరు చిరంజీవులు కదా మీ కంటే వయసులో పెద్ద వారున్నారా?” అని అడిగాడు. 

మార్కండేయుడు.. “ధర్మజా! పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఉండే వాడు. అతను చేసిన పుణ్యం కారణంగా చాలా కాలం స్వర్గ సుఖాలు అనుభవించాడు. పుణ్యం క్షీణించడం వలన అతనిని తిరిగి భూలోకానికి వెళ్ళమన్నారు. అతడు నా దగ్గరకు వచ్చి ‘మహర్షీ నేనెవరో మీకు తెలుసా?’ అని అడిగాడు. అందుకు నేను.. ‘అయ్యా! మీరెవరో నాకు తెలియదు. హిమాలయాలలో నాకన్నా వయసులో పెద్ద వాడు ఉన్నాడు. అతని పేరు ‘ప్రవార కర్ణుడు’ అనే గుడ్లగూబ. దానిని అడుగుము!’ అని చెప్పాను.
 
ఇంద్రద్యుమ్నుడు నన్ను కూడా తనతో రమ్మన్నాడు. నేను వృద్ధాప్యంతో రాలేనని చెప్పాను. అతను గుర్రం రూపం ధరించి నన్ను తీసుకు వెళ్ళాడు. ఆ గుడ్లగూబను కృడా నన్ను ప్రశ్నించినట్లే ప్రశ్నించాడు. ఆ గుడ్లగూబ కూడా.. ‘అయ్యా! నేను నిన్ను ఎరుగను కానీ ఇంద్రద్యుమ్నం అనే కొలనులో నాడీజంఘుడు అనే కొంగ ఉన్నది. దానికి తెలిసి ఉంటుంది.’ అన్నది.

ఇంద్రద్యుమ్నుడు నన్ను, గుడ్ల గూబను తీసుకుని నాడీ జంఘుడి వద్దకు తీసుకు వెళ్ళి నన్ను అడిగినట్లే అడిగాడు. 

అందుకు నాడీ జంఘుడు.. ‘అయ్యా! నేను కూడా ఎరుగను నా కంటే పెద్ద వాడైన అకూపారుడు అనే తాబేలుకు తెలిసి ఉండచ్చు. దానిని అడగచ్చు అన్నది.

ఇంద్రద్యుమ్నుడు నన్ను, గుడ్లగూబను, కొంగను, తాబేలు వద్దకు వచ్చాడు.

తాబేలును కూడా నన్ను అడిగినట్లే అడిగాడు. 

ఆ తాబేలు.. ‘అయ్యా! నేను ఎరుగక పోవడం ఏమిటి. ఆయన మహాత్ముడు గుణవంతుడు. ఆయన నన్ను ఎన్నో ఆపదల నుండి కాపాడాడు. ఆయన ఎన్నో యజ్ఞాలు చేసాడు. బ్రాహ్మణులకు ఆవులను దానాలు చేసాడు. ఆయన దానాలు చేసిన ఆవుల గిట్టల రాపిడితోనే ఈ మడుగు ఏర్పడింది.’ అని చెప్పింది.

తాబేలు చెప్పిన మాటలకు దేవతలు స్వర్గం నుండి విమానం తీసుకు వచ్చి.. ‘అయ్యా! మీరు పుణ్యాత్ములు! మీకు శాశ్వత స్వర్గలోక ప్రాప్తి లభించింది!’ అని చెప్పారు.

ఇంద్రద్యుమ్నుడు.. ‘అయ్యా నా మాట ప్రకారం వీరంతా నా వెంట వచ్చారు వీరిని వారి వారి స్వస్థలాలలో వదిలి వస్తాను.’ అని చెప్పి అందరిని వారి వారి స్థలాలలో దింపి వచ్చి స్వర్గానికి వెళ్ళాడు.

దుంధుమారుడు:

ధర్మరాజు మార్కండేయినితో.. “మహర్షీ! మీ కన్నా వయసులో పెద్దల గురించి చెప్పారు. అలాగే ఇక్ష్వాకు వంశంలో జన్మించిన కువలయాశ్వునికి ఆ పేరెలా వచ్చిందో వివరించండి.” అని అడిగాడు. 

అందుకు మార్కండేయుడు… “ఉదంకుడనే మహర్షి విష్ణువుని గురించి తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి ‘ఏమి కావాలో కోరుకో’ అని అడిగాడు.

ఉదంకుడు.. ‘దేవా! నీవు ప్రత్యక్షం కావడం కంటే వేరే వరం ఎందుకు. సదా నా మనస్సు నీపై లగ్నం అయ్యేలా వరమిస్తే అదే చాలు.’ అన్నాడు. 

విష్ణువు… ‘ఉదంకా ! నీకు జ్ఞానం సిద్దిస్తుంది, అలాగే నీ వలన ఒక మహత్కార్యం సిద్దిస్తుంది. లోకకంటకుడైన దుంధుడు అనే రాక్షస సంహారానికి నీవు సహకరిస్తావు. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన కువలయాశ్వునికి నా చేత ప్రసాదించబడిన యోగబలానికి నీ ప్రయత్నం తోడైతేనే సంహరింపబడగలడు. నీవు అతనిని సమాయత్తం చేసి ఈ కార్యం నెరవేర్చి లోకాలకు మేలు కలిగించు!’ అని చెప్పి మాయమయ్యాడు.

ఉదంకుడు తన తపస్సు కొనసాగించాడు.

”ధర్మజా! కువలయాశ్వుడు ఇక్ష్వాకు వంశంలో జన్మించిన వాడు. ఇక్ష్వాకు కుమారుడు అనసేనుడు. అతడి కుమారుడు పృధుడు. అతడి కుమారుడు విషగ్వుడు. అతడి కుమారుడు ఆర్దుడు. అతడి కుమారుడు యవనాశ్వుడు. అతడి కుమారుడు శ్రావస్తుడు. అతడి కుమారుడు బృహదశ్వుడు. బృహదశ్వుని కుమారుడు కువలయాశ్వుడు. కువలయాశ్వునికి ఇరవై ఒక్క వేల కుమారులు ఉన్నారు అందరూ మహా బలవంతులు. విలు విద్యలో ఆరితేరిన వారు. బృహదశ్వుడు కువలయాశ్వునికి రాజ్యం ఇచ్చి తపోవనాలకు వెళ్ళాలని అనుకున్నాడు.

ఉదంకుడి కోరిక:

ఆ తరుణంలో ఉదంకుడు బృహదశ్వుని వద్దకు వెళ్ళి… ‘రాజా! నీవు అడవులలో ఉండి తపమాచరించే కంటే ప్రజా రక్షణ చేస్తూ రాజ్య పాలన చేయడం మేలు కదా! అలాగైతేనే సాధువులైన మాకు మేలు అధికం. మధుకైటబుల కుమారుడు దుంధుడు మా ఆశ్రమ సమీపంలో తపస్సు చేస్తున్నాడు. దుంధుడు బ్రహ్మదేవుని మెప్పించి వరాలు పొందాడు. అతడు విడిచేగాలికి, రేగే ధూమం వలన మేము అనేక అవస్థలు పడుతున్నాము. కనుక నీవు దుంధుడిని సంహరించి మమ్ములను రక్షించాలి!’ అన్నాడు.

’విష్ణుమూర్తి కూడా ధుంధుడిని సంహరించడానికి యోగబలం అందిస్తానని చెప్పాడు. నీవు ఆరాక్షసుని సంహరించి మాకు రక్షణ కలిగించాలి’ అని కోరాడు.

బృహదశ్వుడు.. ‘మహాత్మా! దుంధుడిని సంహరించడానికి నా కుమారుని పంపుతాను. నాకు తపో వనాలకు వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వండి!’ అని కోరాడు.

ఉదంకుడు అందుకు అంగీకరించాడు. ఉదంకుని కోరిక ప్రకారం బృహదశ్వుడు కువలయాశ్వుని ధుంధుడిని సంహరించమని పంపాడు. విష్ణుమూర్తి తన యోగశక్తిని కువలయాశ్వునిలో ప్రవేశ పెట్టాడు. కువలయాశ్వుడు ఇసుక తిన్నెలను తవ్వించి అక్కడ నిద్రిస్తున్న రాక్షసుని నిద్ర లేపారు. అతడు వదిలిన గాలి అగ్నిజ్వాలలై కువలయాశ్వుని ముగ్గురు కుమారులు తప్ప అందరూ మరణించారు. కువలయాశ్వుడు ఆ రాక్షసునితో ఘోరంగా యుద్ధం చేసి చివరిగా బ్రహ్మాస్త్రం ప్రయోగించి రాక్షసుని సంహరించాడు. అప్పటి నుండి కువలయాశ్వుడు దుంధుమారుడుగా పిలువబడ్డాడు. అప్పుడు, ఉదంకుడు, దేవతలు, మహర్షులు కువలయాశ్వుని వరం కోరుకొమ్మని అడిగారు. కువలయాశ్వుడు… ‘మహాత్ములారా ! నాకు ఎల్లప్పుడూ విష్ణు భక్తి, బ్రాహ్మణభక్తి, దానం చేసే శక్తి అనుగ్రహించండి!’ అని వేడుకున్నాడు. అతను కోరిన వరాలు ప్రసాదించి అందరూ తిరిగి వెళ్ళారు.✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: