Srimadhandhra Bhagavatham -- 24, 25


Srimadhandhra Bhagavatham -- 24, 25

పరీక్షిత్తు వేటకి వెళ్ళి వేటాడాడు. దప్పిక, ఆకలి కలిగింది. ఆకలి దప్పిక కలిగినప్పుడు అవి పోగొట్టుకునేందుకు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. పరీక్షిత్తుకి బుద్ధి భ్రంశము అవుతున్నది. అతడు దగ్గరలో ఉన్న మహర్షి ఆశ్రమమునకు వెళ్ళాడు. దాహార్తి తీర్చమని అక్కడ ఆశ్రమములో సంచరిస్తున్న స్త్రీ పురుషులనెవరినయినా అడగాలి. కానీ పరీక్షిత్తు వారినెవరినీ అడగలేదు. అతనిలో అహంకారము ప్రవేశించింది. నేరుగా తపోదీక్షలో ఉన్న శమీకమహర్షి దగ్గరకు వెళ్ళాడు. ఆయన స్థాణువయి ధ్యానము నందు తపస్సునందు చాలా మగ్నుడయి బ్రహ్మమునందు రమిస్తు ఏమాత్రం కదలిక లేకుండా ఉన్నాడు. ప్రాణాయామము చేత ప్రాణమును నియంత్రించి కుంభకము చేత వాయువును పూరించి ఆపుచేసాడు. మనస్సు ఊపిరిమీద ఆధారపడుతుంది. మనస్సు ఇప్పుడు కదలడం లేదు. మనస్సు కదలకపోవడం వల్ల బుద్ధి కదలడం లేదు. బుద్ధి కదలకపోవడం వల్ల ఇంద్రియములు కదలడం లేదు. బయట విషయమును కన్ను చూడదు, చెవులు వినబడవు. స్పర్శేంద్రియములు బాహ్యజ్ఞానము తెలియదు. జాగ్రదాది మూడు అవస్థలను దాటిపోయి చివరకు తురీయమనే స్థాయికి చేరిపోయి, తాను సాక్షాత్తు ఆత్మగా సాక్షీభూతుడై శరీరమును చూస్తూ బ్రహ్మముగా నిలబడిపోయి ఉన్నాడు. అలా కూర్చుని బ్రహ్మముతో రమించి ఉండిపోతే ఆయన వెంట్రుకలు, గోళ్ళు, పెరిగిపోతున్నాయి. అవి జటలు కట్టేసి కేశ సంస్కారము లేక వ్రేలాడుతున్నాయి. ఒక కృష్ణజింక చర్మమును కట్టుకుని అలా కూర్చుని ఉండిపోయాడు. వస్త్రం కూడా లేదు.

శమీక మహర్షి దగ్గరకు దాహంకోసం ఆర్తిపొందిన పరీక్షిత్తు వెళ్ళాడు. ఆయన నీటికోసం వెళ్ళడం ప్రధానాంశం. పరీక్షిత్తు లోపల ఒక మౌనభాష బయలుదేరింది. ఇప్పుడు పరీక్షిత్తు తానెవరో మరిచిపోయాడు. అతని బుద్ధి భ్రంశమయి బ్రహ్మమునందు రమిస్తున్న తాపసిని చూసి నిశ్శబ్దముగా తాను వెళ్ళిపోవాలి. కానీ తాను అలా వెళ్ళక మహారాజునయిన నేను వస్తే లేచి నిలబడలేదని, నమస్కరించలేదని, ఆసనం చూపించలేదని ఆ తపస్వి మిక్కిలి అహంకారుడని భావించాడు.

ఇప్పుడేమయింది? 
అంత గొప్ప పరీక్షిత్తు, తెల్లవారిలేస్తే బ్రాహ్మణులకు నమస్కారం చేసేవాడు అన్నీ తెలిసినవాడు అన్నిటినీ మరచిపోయాడు. కలి ప్రవేశము వలన అన్నీ భ్రంశమయి అతనిలో ఆగ్రహం పుట్టి యుక్తాయుక్త విచక్షణను కోల్పోయాడు. ఒక స్థానంలోంచి మరొక స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు.
ఆ మహర్షిని ఎలా అవమానించాలా! అని తలంచాడు. సమీపములో చచ్చిపోయి పడివున్న పాము ఒకటి కనిపించింది. చచ్చిపోయిన పాము అయినా మెడలో వేసేసరికి చల్లగా తగిలి మహర్షికి తెలివి వస్తుంది. ఆయనను గేలిచేయవచ్చు అనుకున్నాడు. పరీక్షిత్తు లోపల వికృతాతివికృతమయిన ఆలోచనలు పెరిగిపోయి తన ధనుస్సు చివరి భాగంతో మృతసర్పమును పైకి ఎత్తాడు. ఒక ప్రభువు, ధర్మరాజు మనుమడు, అభిమన్యుడి కుమారుడయిన పరీక్షిత్తు ఒక చెయ్యరాని పనిని చేసాడు. ప్రపంచంలో పరమ భయంకరమయిన సన్నివేశము జరుగుతున్నది. ఆ మృత సర్పమును పైకి ఎత్తి శమీక మహర్షి మెడలో వేశాడు.
ఆయనకు స్పర్శ తెలియలేదు. తపస్వియై ఉన్న వానిలోనికి కలి వెళ్ళలేకపోయాడు. ఎందుచేతనంటే మహర్షి ఇంద్రియములు, మనస్సు ఈశ్వరుని పట్టి వున్నాయి. ఒక్క స్థానమునకు ఆశ్రయం ఇచ్చిన పరీక్షిత్తులోనికి కలి ప్రవేశించి మొత్తం నాశనం చేయగలిగాడు.
బాగుపడాలంటే శమీకమహర్షి పట్టుకున్న భగవంతుని పాదములు పట్టుకోవాలని భాగవతం చెపుతున్నది. శమీకుడు పట్టుకున్న ఈశ్వరుని పాదములు పట్టుకుంటే ఆ స్పర్శ ఉన్నంతకాలం కలి సమీపమునకు రాలేడు. ఇది భాగవతము చెప్తున్న తీర్పు. పరీక్షిత్తు తాను చేసిన పనికి సంతోషపడి వెనక్కి వెళ్ళిపోయి, అంతఃపురంలోకి వెళ్ళి కిరీటం తీసి ప్రక్కనపెట్టాడు. బంగారుకిరీటం ప్రక్కన పెట్టగానే అందులోంచి కలి బయటకు వెళ్ళిపోయాడు.
కిరీటం ప్రక్కన పెట్టగానే ఆయనకు అనుమానం వచ్చింది. ‘దాహం వేయడం ఏమిటి? – నేను ఆయన ఆశ్రమమునకు వెళ్ళడం ఏమిటి? – వెళ్ళిన వాడిని ఊరుకోకుండా చనిపోయిన పామును ఆయన మెడలో వేయడం ఏమిటి? – అయిపోయింది – నా రాజ్యం అయిపోయింది. నా ధనం అయిపోయింది – నా భోగం అయిపోయింది – నా పరిపాలన అయిపోయింది – నేను చెయ్యరాని దుష్కృతమును చేసాను – దీనికంతటికీ కారణం కలిపురుష ప్రవేశము – ఎంత తప్పు చేశానో' అని పశ్చాత్తాప పడ్డాడు. పరీక్షిత్తు సహజస్థితి అదికాదు. కలి పురుషుడి వలన అలా భ్రష్టుడయి పోయాడు.
పరీక్షిత్తు మహర్షి మెడలో చచ్చిపోయిన పామును వేయడం, సమీపములో ఉన్న మునికుమారులు చూశారు. వాళ్ళు పరుగెత్తుకుంటూ అక్కడికి సమీపములో కౌశికీనది ఒడ్డున ఆడుకుంటున్న శమీక మహర్షి కుమారుడయిన శృంగి వద్దకు వెళ్ళారు. ఆ పిల్లవాడు మహా తపస్వి. ఆ పిల్లలు ‘మీనాన్నగారు తపస్సు చేసుకుంటూ సమాధిలో ఉండగా ఒక రాజు వచ్చి ఏదో మాట్లాడాడు. మీ తండ్రి పలకలేదు. అపుడు ఆ రాజుకి కోపం వచ్చి చచ్చిపోయిన పామును ధనుస్సుతో ఎత్తి మీ నాన్నగారి మెడలోవేసి వెళ్ళిపోయాడు అని చెప్పారు.
ఈ మాటలు విన్న వెంటనే శృంగి ‘నాతండ్రి వంటి తపస్వి ఇక్కడ ఉండడం వలన రాజు క్షేమంగా రాజ్యమును పరిపాలించగలిగాడని వెంటనే శాపం ఇవ్వడానికి కౌశికీ నదీ జలములను చేతిలోకి తీసుకుని చేతిలో ధనుస్సు ఉన్నది కదా అని ఆ రాజు చెయ్యకూడని పనిని చేశాడు. అటువంటి రాజు ఎవరయినా ఉండవచ్చు గాక! ఈశ్వరుడు, శ్రీమహావిష్ణువు అడ్డుకున్నా వానిని నేటినుండి ఏడవనాటికి తక్షకుడనే మహాసర్పము కాటు వలన రాజు మరణించుగాక!’ అని శపించి నీళ్ళు విడిచిపెట్టి, తిరిగి ఆశ్రమమునకు వచ్చి, తండ్రి ముందు ఏడవడము ప్రారంభించాడు.
తండ్రికి బాహ్యస్మృతి వచ్చింది. ‘ఎందుకు ఏడుస్తున్నావని కుమారుని అడిగాడు. తండ్రీ! మీ కంఠమునందు మృత సర్పము ఉన్నది అన్నాడు. దానిని తీసి క్రింద పడవేశాడు శమీకుడు. ఎవరు వేశారని కుమారుని ప్రశ్నించాడు. నాకు తెలియదు. ఎవరో రాజు వేశాడట. నేటికి ఏడవనాటికి ఆ రాజు చచ్చిపోవాలని నేను ఆ రాజును శపించానని శృంగి జవాబిచ్చాడు. వెంటనే మహర్షి – నాయనా! ఎంతపని చేశావు? నీవు చేసిన దుష్కర్మ వలన మనకి పాపం సంప్రాప్తిస్తుంది. నీవు రాజు మరణించాలని కోరుకున్నావు’. కలిపురుషుడు ప్రవేశించిన మనస్సులు అలా ఉంటాయి. అపకారియందు కూడా ఔదార్యంతో ధర్మం మాట్లాడతాడు. అటువంటి పరిపాలకుడు ఎక్కడ వస్తాడు మనకు! సమాజము భ్రష్టు పట్టిపోతుంది. పరీక్షిత్తును కొట్టి సమాజమునందు ఇన్ని ప్రమాదములు తేవడానికే కలి ఇలా నీచేత శాపం ఇప్పించాడు. నీవు క్రోధమునకు వశుడవయిపోయావు. ఎంత పొరపాటు చేశావు!’ అన్నాడు.
ఈవార్త పరీక్షిత్తుకు తెలిసి ఇంకా నాటికి ఏడవరోజున శరీరం విడిచిపెట్టేస్తానని ప్రాయోపవేశం చేస్తానని గంగ ఒడ్డుకు వెళ్ళి, తూర్పుదిక్కుకు కొసలు ఉండేలా దర్భలు పరుచుకుని ప్రాయోపవేశం చేసి, ఈశ్వరుని యందు మనస్సును నిలబెట్టాడు. గంగ ఒడ్డుకు ఎందుకు వెళ్ళాడు అంటే ఎవరయినా గంగ దగ్గరకు వచ్చి ‘అమ్మా, గంగమ్మా’ అని పిలిస్తే గంగమ్మ పొంగిపోయి ఆ పిలిచిన వానిని ఎంతగానో అనుగ్రహిస్తుంది. గంగలో స్నానం చేయడం ద్వారా అతడు చేసిన తప్పులన్నిటినీ తీసివేసి మోక్షమును ప్రసాదించి పంపించివేస్తుంది. గంగ ఒడ్డున ప్రాయోపవేశం చేశాడు. ఎవరు యాగం చేస్తే దేవతలు అందరూ వచ్చి కూర్చున్నారో అటువంటి మహా పురుషుడు శాపగ్రస్తుడై ప్రాయోపవేశం చేశాడు. ఈ సన్నివేశమును చూడడానికి గౌతముడు, అగస్త్యుడు, విశ్వామిత్రుడు, వసిష్ఠుడు మొదలయిన ఋషులందరూ వచ్చారు. ఈ ఏడురోజులలో తాను ఏమిచేస్తే మోక్షం పొందుతాడో చెప్పవలసినదని పరీక్షిత్తు అందరినీ అడుగుతున్నాడు. ఇంత ధర్మము ఉన్నవాడు ఇంత అధర్మమయిన పని చేయడమా! కలికి కొద్ది అవకాశం ఇస్తే అంత ప్రమాదమును తెచ్చాడు. కాలమును అతిక్రమించడం ఎవరి తరం కాదు. ఇంతటి స్థితిలోకూడా ఈశ్వర పాదములు పట్టుకున్న వాడు మాత్రం చెక్కు చెదరడము లేదు. ఆ సమయములో అక్కడికి పదహారు సంవత్సరముల వయస్సు కల ఒకాయన వచ్చాడు. ఆయన మంచి యౌవనములో ఉన్నాడు. నల్లటి జుట్టు ముఖం మీద చిందరవందరగా పడిపోయి ఉంది. ఒక కౌపీనము పెట్టుకుని ఉన్నాడు. చుట్టూ చిన్నపిల్లలు అందరూ చేరారు. సూర్యుడు ఈ భూమండలం మీద నడుస్తున్నాడా అన్నట్లుగా ఒకరు పిలవకపోయినా ఆవుపాలు పితికే సమయం కంటే ఎక్కువసేపు ఒకచోట నిలబడని శుకుడు తనంత తాను నడిచి వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఆయన తేజస్సు చూసి పొంగిపోయిన పరీక్షిత్తు ‘కృష్ణభగవానుని మా వంశము అంతా అర్చించినందుకు నేను వెళ్ళిపోతున్న సమయములో నాకు మార్గం చూపించడానికి గురువును పంపాడు కృష్ణ పరమాత్మ’ అని పొంగిపోయి అర్ఘ్యపాద్యములను ఇచ్చి శుకుడి కాళ్ళమీద పడితే, కదిలి వెళ్ళిపోవడం అలవాటున్న శుకుడు కూర్చున్నాడు.

.....

Srimadhandhra Bhagavatham -- 25

శుకబ్రహ్మ రావడములో ఒక గొప్పతనం ఉన్నది. ఒక సమస్య ఏర్పడడం గొప్పతనం కాదు. కలియుగ ప్రవేశము జరిగితే దానివల్ల ప్రభావితుడయినవాడు పరీక్షిన్మహారాజు గారు ఒక్కడే కాదు – కలియుగంలో ఉన్న అందరూ కలిచేత బాధింపబడుతున్న వాళ్ళే . ఇప్పుడు కలి బాధనుండి తప్పుకోవడానికి మార్గం ఏదయినా ఉంటుందా? – ఇది చెప్పేవాడు ఎవరయినా ఉండాలి. కలి బాధలను పడుతున్న మనమీద కలి ప్రభావం ప్రసరించకుండా ఉండడము కోసమని మనం చేయవలసిన ప్రయత్నమునయినా చెప్పగలిగిన సమర్థుడు రావాలి. అటువంటి సమర్థుడయిన శుకుడు వచ్చాడు.

ఇక్కడ ఒక విషయమును పరిశీలించాలి. 

ఎవరికయినా మృత్యువు ఆసన్నమయిపోయిందని రెండు మూడు రోజులలో వెళ్ళిపోతారు’ అని చెపితే – ఆ చనిపోబోయే ఆయన దగ్గరకు ఎవరయినా వెళ్ళి ‘మీకు కొన్ని మంచి విషయములు చెపుదామని – మీకు భాగవతము చెపుదామని వచ్చామ’ని అంటే – ఆ మంచి విషయమును వినడానికి అంగీకరించక ఇప్పుడు ఎందుకు అంటాడు. ఆ ఉన్న రెండురోజులు భార్యాబిడ్డలను చూసుకోవాలని అనిపిస్తుంది. ఇక్కడ పరీక్షిన్మహారాజు గారు ఒక గొప్ప విషయం చేశాడు. శుకమహర్షి వస్తే ఈయనను ఎవ్వరూ వేయని ప్రశ్న ఒకటి వేశాడు. పరీక్షిన్మహారాజు – ‘ఏడు రోజులలో నాకు మరణము ఖాయమన్న విషయము తెలిసిపోయింది. నేను పాముచేత కరవబడతానని శృంగి శపించాడు. శృంగి శపించాడని నేను ఖేదపడడము లేదు. నేను పరమధార్మికులయిన పాండవుల వంశములో జన్మించిన వాడినయి, తపస్సు చేసుకుంటున్న ఒక మహర్షి మెడలో మృతసర్పమును వేసి చేయరాని పని చేసానని బాధపడుతున్నాను. శృంగి నన్ను ఎలా శపించాడో అలాగే ఈ శరీరమును తీసుకువెళ్ళి ఆ పాముకి అప్పచెపుతాను. నేను నా మరణమును అంగీకరిస్తున్నాను. నాకు భవిష్యత్తులో మళ్ళీ జన్మ వచ్చినప్పుడు నా మనస్సు ఎల్లవేళలా శ్రీమహావిష్ణువునే స్మరిస్తూ ఉండాలి. ఎక్కడ స్వామివారి ఉత్సవమూర్తి కనపడినా, స్వామి దేవాలయం కనపడినా గభాలున శిరస్సువంచి నమస్కరించగలిగిన సంస్కారబలం నాకు కావాలి. ఆ స్వామి గురించి నాలుగు మాటలు చెప్పేవాడు దొరికితే చాలు పరుగెత్తుకుంటూ వెళ్ళి వాని మాటలు వినే జిజ్ఞాస నాకు కలుగు గాక ! నిరంతరము ఈశ్వరుని పాదసేవనము చేయగలిగిన కర్మేంద్రియములు నాకు కావాలి. నేను దానిని అర్థిస్తున్నాను. ఇది కలిగేటట్లుగా మీరందరు నన్ను అనుగ్రహించి ఆశీర్వచనం చేయవలసింద’ని ప్రార్థించాడు.

పరీక్షిత్తు ఉత్తరజన్మ ఉత్కృష్టమయినది కావాలని ఆయన అడగలేదు. ఆయన – ఏ జన్మలో ఉన్నా, ఏ శరీరములో ఉన్నా కావలసినవి ఏమిటో వాటిని అడిగాడు. ‘హరిచింతారతియున్’ ‘హరి ప్రణుతి’ ‘భాషాకర్ణనాసక్తియున్’ ‘హరిపాదాంబుజసేవయుం’ ఈ నాలుగు నాకు కావాలని అడిగాడు. శుకబ్రహ్మ వచ్చి కూర్చుని ఉంటే శుకబ్రహ్మకు పాదప్రక్షాళనం చేసి ఆచమనీయము ఇచ్చి సాష్టాంగ నమస్కారం చేసి ఒకమాట చెప్పాడు. ‘నాకు ఒక్క కోరిక ఉన్నది. నేను మళ్ళా పుట్టవలసిన అవసరం లేని మోక్షమును పొందడానికి కల్పవృక్షములా మీరు వచ్చారు. మీరు ఒకచోట ఉండేవారు కాదు. అటువంటిది మీరు అనుకోకుండా వచ్చి నన్ను అనుగ్రహించారు. నాకు అటువంటి విషయము ఏది ఉన్నదో దానిని నాకు తెలియజేయవలసినది’ అని ప్రార్థించాడు.

భాగవతం - ద్వితీయస్కంధము 

భాగవతములో శుకుడు రావడమే ఒక పవిత్ర ఘట్టం. శుకబ్రహ్మ వచ్చి పరీక్షిత్తు చెప్పిన మాటలను విన్నాడు. తనగురించి తాను ఏమీ చెప్పుకోలేదు. శుకుడు ఒక్కమాట చెప్పాడు. ‘పరీక్షిన్మహారాజా! నేనొక విషయం చెపుతాను జాగ్రత్తగా విను. పూర్వం ఖట్వాంగుడు అనే ఒకరాజు ఉండేవాడు. అతడు దేవతలకు యుద్ధములో సాయము చెయ్యాలని భూమిని విడిచిపెట్టి రథమును ఎక్కి స్వర్గలోకమునకు వెళ్ళి రాక్షసులతో యుద్ధం చేశాడు. చాలా దీర్ఘకాలము పోరు సాగింది. రాక్షసులు ఓడిపోయారు. దేవతలు అందరూ ఖట్వాంగుడిని అభినందించారు. ‘నీవు మాకోసమని పైలోకమునకు వచ్చి యుద్ధం చేశావు. నీకేమి వరం కావాలో కోరుకో’ అన్నారు. ఆయన ‘నాకేమీ వరం అక్కర్లేదు. నా ఆయుర్దాయం ఎంత మిగిలిందో చెప్పమని అడిగాడు. దేవతలు వాని ఆయుర్దాయం లెక్కచూసి ఇంకొక ఘడియ మాత్రమే ఉన్నదని చెప్పారు. తాను తరించిపోవడానికి ఆ ఒక్క ఘడియ ఆయుర్దాయం చాలునని ఖట్వాంగుడు భావించి వెంటనే తన రథం ఎక్కి గబగబా భూమండలమునకు వచ్చి అంతఃపురంలోకి వెళ్ళి ఈమాట చెప్పేసి, ధ్యానమగ్నుడై ఈశ్వరుడిని ధ్యానం చేస్తూ కూర్చుని శరీరమును విడిచి పెట్టేసి మోక్షమును పొందాడు. ఒక్క ఘడియ కాలం మాత్రమే ఆయుర్దాయం కలిగిన ఖట్వాంగుడే మోక్షమును పొందగలిగాడు. నీకు ఇంకా ఏడురోజుల సమయము ఉన్నది. నీకు తప్పక మోక్షం లభిస్తుంది’ అని చెప్పాడు.

ఇంత గొప్పగా ఇలా మాట్లాడిన వాడు గురువు. మరణించే వారందరికీ పరీక్షిత్తు ప్రతినిధి. నేను నేననుకున్న ఈ శరీరమే కట్టెదుట అగ్నిహోత్రములో కాలి దోసెడు బూడిద అయిపోతుంది. ఈ అహంకారమును గుర్తించని కారణము చేత మరల హీనోపాధిలోకి వెళ్ళిపోవడము జరుగుతున్నది. ఈశ్వరుడి పాదములను పట్టుకో. అవి మాత్రమే నిన్ను రక్షిస్తాయి. వివేకము తెలుసుకొమ్మని చెప్పాడు. ఇక్కడ శుకుడు విరాడ్రూప వర్ణనమునంతా చేసి హరిలేని పదార్థము లేదు. ఋషులు, సముద్రములు, భూమి, పంచమహాభూతములు ఇవన్నీ కూడా ఈశ్వరుని అంగాంగములై ఉన్నాయి. ఎక్కడ చూసినా ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే. 

ఈశ్వరుడు ఎందుకు కనపడడము లేదు? అదే మాయ. అది నామ రూపములయందు కలిగిన తాదాత్మ్యం తదధిష్టానమయిన బ్రహ్మమునందు కలుగదు. అలా కలగాలంటే మాయ తొలగిపోవాలి. ప్రపంచంలో ఉన్నది మాయ. ఆ మాయని గురుముఖంగా తెలియగానే మాయ తొలగిపోతుంది అప్పటివరకు తొలగదు. దానికి ఈశ్వర కృప తోడయితే తొలగుతుంది. మాయ తొలగినపుడు లోపల వున్న ఆత్మ భాసిస్తుంది. మాయ తొలగడం అనేది అంత తేలికయిన విషయం కాదు.

ఈశ్వరుని కోసం నీవు ఎక్కడా తిరగనక్కరలేదు. విశ్వము హరి. హరి విశ్వము. అజ్ఞానము చేత లోకములో ఈశ్వరుడు, లోకము ఇంకా ఇంకా అలా కనపడుతున్నాయి. కానీ జ్ఞాననేత్రము చేత చూస్తే ఉన్నది ఒక్కటే. నీవు కానీ సక్రమముగా వినదలుచుకుంటే హరిమయము కాని పదార్థము ఈ ప్రపంచమునందు లేదు. ఇది తెలుసుకొని సమస్తము ఈశ్వరమయం జగత్ అని అంగీకరించి, అంతటా బ్రహ్మమును చూసి ఉన్నది బ్రహ్మమే అని నీవు అంగీకరించగలిగితే నీకు ఉత్తరక్షణమే మోక్షము’ అని బోధచేసి భక్తి నిలబడడానికి శుకుడు ఒక మాట చెప్పాడు. 

‘నేను భక్తిగా ఉంటాను అంటే కుదరదు. ఈశ్వరునియందు పూనిక కలగాలి. ఇంట్లో కూర్చుని భగవంతుని మీద భక్తి రావాలని అనుకుంటే రాదు. ఈశ్వరునికి ముందు నమస్కారం చేయడం మొదలుపెడితే ఆయన నీకొక దారి చూపిస్తాడు. భగవంతుని కథలు వినడమనే స్థితికి నిన్ను తీసుకువెడతాడు. మనిషి కొన్ని కోట్ల కోట్ల జన్మల వరకు అసలు భాగవత కథవైపు వెళ్ళడు. వెళ్ళాడంటే అతని జీవితములో గొప్ప మార్పు ప్రారంభమయిందన్న మాట. భగవంతుని కథలను వినడము నీవు ప్రారంభిస్తే భక్తి కలుగుతుంది. ఆ భక్తితో అంతటా నిండియుండి చూస్తున్న వాడు, చేయిస్తున్న వాడు సర్వేశ్వరుడనే భావన నీకు కలిగిన నాడు, నీకు తెలియకుండా భక్తిలో ఒక విచిత్రం ఏర్పడుతుంది.

భాగవతం మనస్సుకు ఆలంబనం ఇస్తుంది. మనస్సును మారుస్తుంది. ఈశ్వరుని వైపు తిప్పుతుంది. దీనిని అందరూ పొందలేరు. ఈ అదృష్టం పొందాలి అంటే ఈశ్వరానుగ్రహం కూడా ఉండాలి. ఎవరిని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడో వారు మాత్రమే భాగవతమును వినగలరు తప్ప అందరూ భాగవతమును వినలేరు. ‘నీవు భగవత్కథా శ్రవణముతో ప్రారంభము చెయ్యి. ఈ సమస్త జగత్తును సృష్టించిన వాడు ఆయనే’ అని చెప్పాడు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: