శ్రీసూర్యనారాయణస్వామి ఆలయం, అరసవిల్లి

శ్రీకాకుళం జిల్లా : అరసవిల్లి

శ్రీసూర్యనారాయణస్వామి ఆలయం
              

శ్రీ సూర్యనారాయణ దేవాలయాలు భారతదేశంలో అరుదుగా వున్నాయి. ఒరిస్సాలోని పూరీకి సమీపంలో కోణార్క్ సూర్యదేవాలయం వుంది. శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లిలో శ్రీ ఉషా పద్మినీ ఛాయా సమేత శ్రీ సూర్య నారాయణస్వామి దేవాలయం వుంది. ఇది గొప్ప సూర్యక్షేత్రం.

’ఓం ఆదిత్యాయ నమః..’ అంటూ భక్తులు వేనోళ్ల పొగిడే దివ్య ఆదిత్య క్షేత్రం.. శ్రీకాకుళం సమీపంలోని అరసవల్లి సూర్యక్షేత్రం!

భక్తులు సూర్యభగవానుని శరణుజొచ్చి, పూజలు, అభిషేకాలు సూర్య నమస్కారాలు జరిపి తమ కోర్కెలు ఫలించడంతో హర్షభరితులై తమ ఇండ్లకు వెళతారు. అందుకే ఈ క్షేత్రానికి హర్షవల్లి అనే పేరు వచ్చిందని, అదే వాడుకలో అరసవిల్లి అయిందని అంటారు.

ఈ క్షేత్ర స్వామి గ్రహాధిపతి కావడం వల్ల దర్శన మాత్రముననే సర్వగ్రహారిష్ట శాంతి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్యకిరణాలు ఉదయసంధ్యలో మూలవిరాట్టు పాదాలకు సోకేలా ఈ దేవాలయం నిర్మించబడింది. దేవాలయ వాస్తులో యిదో ప్రత్యేకత. కంచిలోని ఏకాంబరేశ్వరాలయంలో కూడా యిలాంటి ఏర్పాటు వుంది. ఈ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో కళింగరాజు దేవేంద్రవర్మ నిర్మించినట్లు కొందరు పురావస్తు శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు.

అరసవల్లిలో సూర్యదేవాలయం నిర్మాణం గంగరాజుల్లో ఒకరైన దేవేంద్రవర్మ హయాంలో జరిగింది.

స్థల పురాణం:

కుఱు పాండవ యుద్ధంలో జరగబోయే బంధునాశనం చూడనొల్లక బలరాముడు తీర్థయాత్రలకు బయలుదేరాడు. కరువు కాటకాలతో బాధపడుచున్న కళింగ ప్రజలు తమను ఈ బాధ నుండి విముక్తులను చేయవలసిందిగా బలరాముని ప్రార్థింపగా అతను తన ఆయుధమైన హలం (అనగా నాగలి వలన) ని భూమి పై నాటి జలధార వచ్చేటట్లుగా చేసాడు.

బలదేవుని ఆయుధమైన నాగావళి నుంచి ఉద్భవించినది కాబట్టి నాగావళి (దీనినే లాంగుల్య నది) అని పిలివబడుతుంది.

ఈ నాగావళి నది తీరమందు బలరాముడు ఐదు విశిష్ట శివాలయాలను నిర్మించాడు. అందులో నాలుగవది శ్రీకాకుళం పట్టణంలో వెలసిన ఉమారుద్ర కోటేశ్వరస్వామి ఆలయం. ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించిన సమయంలో శ్రీ స్వామివారిని దేవతలందరూ దర్శించుకున్నారు.

అలాగే ఇంద్రుడు కూడా ఈ మహాలింగాన్ని దర్శించుటకు వచ్చాడు. అప్పటికే కాలాతీతమైంది. పిదప నందీశ్వరుడు, శృంగేశ్వరుడు, బృంగేశ్వరుడు ద్వారపాలకులు శ్రీ స్వామివారిని దర్శించుటకు ఇది తగిన సమయం కాదని వారించారు. పిదప ఇంద్రుడు వారితో ఘర్షణకు దిగాడు. అపుడు నందీశ్వరునికి ఆగ్రహం వచ్చి కొమ్ములతో ఒక విసురువిసిరాడు. ఇంద్రుడు ఆ కొమ్ములవిసురుకు కొంతదూరంలో పడ్డాడు. ఇంద్రుడు పడిన ఆ స్థలంనే ఇంద్ర పుష్కరిణి అంటారు.

అప్పుడు ఇంద్రుడు సర్వశక్తులు కోల్పోగా సూర్యభగవానుని ప్రార్థించగా ప్రత్యక్షమై "నీవు పడిన చోట నీ వజ్రాయుధంతో త్రవ్వమని" చెప్పాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో త్రవ్వగా అచ్చట సూర్యభగవానుని విగ్రహం దొరికింది. దానితోపాటు ఉష, ఛాయ, పద్మిని విగ్రహాలు కూడా లభించాయి. అచ్చట ఇంద్రుడు దేవాలయం కట్టి సూర్యభగవానుని ప్రతిష్ఠించాడు అని పురాణ కథనం.
అదే ఈనాటి అరసవెల్లి క్షేత్రం.

అలాగే ఉత్తరాయణ, దక్షిణాయన మార్పుల్లో భాగంగా ప్రతి ఏటా మార్చి 9, 10, 11, 12 తారీకు ల్లోనూ, అక్టోబర్ 1, 2, 3, 4 తేదీల్లోనూ, స్వామివారి, ధ్రువమూర్తిపై ఆదిత్యుని తొలికిరణాలు తాకుతాయి. స్వామి పాదాల మీదుగా మొదలై శిరోభాగం వరకూ సూర్యకిరణాలు ప్రసరించే అద్భుత, అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని ప్రతీతి.

అరసవల్లి క్షేత్రాన్ని ఆరోగ్య క్షేత్రంగా స్థానికులు పిలుస్తుంటారు. ప్రత్యేకించి బొల్లి, కంటి వ్యాధులు, కుష్టు, వ్యాధులతో పాటు ఇతర మానసిక, శారీరక రోగాల నుంచి విముక్తి కోసం బాధిత భక్తులు ఇక్కడికొచ్చి స్వామి వారిని దర్శించుకుంటుంటారు.

అరసవిల్లి నందు ఏకశిల పై యున్న సూర్యుని విగ్రహం, ఆయన రథ సారధి అమారుడు, ఉష, పద్మిని, ఛాయాదేవి, సనకుడు, సివందుడు, మారరుడు, పింగళుడు వంటి సూర్యభగవానుడి పరివారం కూడా దర్శన మిస్తారు.

“సూర్యకఠారి” చురకత్తిని కూడా ఇక్కడ సతీసమేతంగా రథమున అధిరోహించిన శ్రీసూర్యనారాయణుని నడుమునందు దర్శించవచ్చు.

రథసప్తమి పర్వదినం:

ఈ రోజున రాష్ట్రం నలుమూలల నుంచే కాక.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుంటారు. స్వామివారికి త్రిచ, సౌర, అరుణ ప్రయుక్తంగా సూర్య నమస్కార పూజలు, అష్టోత్తర శత సహస్ర నామార్చనలు నిర్వహిస్తారు.

ఏటా సంక్రాంతి రోజున క్షీరాభిషేకం, ఏకాదశి నాడు కల్యాణసేవ, ప్రతి ఆదివారం తిరువీధిసేవ నిర్వహిస్తారు.*

సూర్యనమస్కారాలు:

రోజూ రూ. 50 చెల్లిస్తే కుటుంబం పేరు మీద అర్చకులు సూర్యనమస్కారాల సేవ చేస్తారు.

శ్రీకాకుళం జిల్లా కేంద్రం బస్‌స్టేషన్‌ నుంచి కేవలం 3 కి.మీ. దూరంలో అరసవెల్లి క్షేత్రం ఉంది.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: