శ్రీరామచంద్రునికి బాల్యంలో వైరాగ్యం
శ్రీమద్రామాయణంలో శ్రీరామచంద్రునికి బాల్యంలో పరిస్థితుల ప్రభావానికి వైరాగ్యం కలుగుతుంది. ఆ సమయంలో విశ్వామిత్రుని మాట ప్రకారం వశిష్ఠ మహర్షి రామునకు దివ్యమైన ఉపదేశాన్ని ఇస్తాడు. అదే యోగవాసిష్ఠమని పేరొందినది. అం దులో మొదటి అధ్యాయం వైరాగ్యమునకు చెందినది. ప్రాపంచిక సుఖాలు తుచ్ఛమైనవిగా భావించినప్పుడే భక్తి కలుగుతుంది.
వశిష్ఠుడు శ్రీరామునిగాంచి ”వత్సా! నీవు ఏమి త్యజించదలిచావు? నీవు రాజభవనం వదలి అడవికి వెళ్ళాలనుకుంటే చిన్న కుటీరం అవసరమవుతుంది. చిన్న వస్త్రం ధరించాలి. కౌపీనం అవసరమౌతుంది. మంచి భోజనం వదలి కందమూలఫలాదులను తినాలి. అందు వలన మనస్సే బంధనానికి కారణమవుతుంది. మనస్సే ముక్తినిస్తుంది. మనసులో విషయ వాంఛలు లేనపుడు మానవుడు ముక్తుడవుతాడు.
విషయాలను చింతన చేస్తే మనస్సుకు భయం కల్గుతుంది. విషయ చింతన త్యజిస్తే శాంతి లభిస్తుంది. స్వప్న జగత్తు వలన అజ్ఞానం కలుగుతుంది. నిద్రనుండి మేలుకొనిన పిదప స్వప్న రూపం కన్పించదు. సుఖదు:ఖాలు అజ్ఞానం వలన కలుగుతాయి. ఇవి మనస్సుకు చెందిన ధర్మాలు. రాగద్వేషాల వలన క్రొత్త ప్రారబ్దం మొదలవుతుంది. జ్ఞాని ప్రారబ్దాన్ని యోగం చేత నశింపజేస్తాడు. సాధన చేస్తూ మనస్సు చెడకుండా ఉండాలని జాగరూకత కలిగి వ్యవహరించాలి. ఈ జగత్తు సంకల్పం నుండి ఉత్పన్నమయినది. శాంతిని పొందాలంటే ప్రపంచాన్ని వదలవలసిన పనిలేదు. కానీ చింతించడం వదలినప్పుడే మనస్సు శాంతిస్తుంది.
భగవంతుని స్వరూపంలో మనస్సు లయమయినపుడే ముక్తి లభిస్తుంది. బాహ్యం నుండి చేసిన త్యాగం త్యాగం కాదు. అది అహంకారం అవుతుంది. కావున మనస్సు చెడకుండా జాగ్రత్తపడాలి. నీవు అన్నీ వదలి అరణ్యానికి వెళ్ళినా జగత్తు నీవెంట వస్తుంది. సత్పురుషులు మాత్రమే ఆసక్తిని త్యజిస్తారు. బ్రహ్మ జ్ఞానాన్ని గురించి చర్చించాలిగానీ, ద్రవ్యాన్ని ప్రేమించేవాడు నిజమైన జ్ఞానికాడు. జ్ఞానానికి చెందిన సప్తభూమికలను నీకు వివరిస్తాను. అవి వరుసగా శుభేచ్ఛ - సువిచారణ - తనుమానస - సఖాపత్తి - అసాపక్తి - భూమిక పదార్థ భావన - తుర్యగా భూమికలు.
మొదటిది శుభేచ్ఛ. ఆత్మకల్యాణం కోసం ఒక బ్రహ్మ నిష్ఠగల గురువును ఆశ్రయించి, ఆత్మసాక్షాత్కారం తీవ్రమైన కోరికనే శుభేచ్ఛ అంటారు.
రెండవది సువిచారణ. సద్గురువు చేసిన ఉపదేశాలను మోక్షమార్గం చూపు శాస్త్రాలను పదేపదే చింతన చేయడం.
మూడవ భూమిక ‘తనుమానసి - శ్రవణ - మనన నిధి - ధ్యాసల ద్వారా విషయాలయందు దేనివలన అనాసక్తి కలుగుతుందో బుద్ధికి సూక్ష్మత లభించునో అదే తను మానస అవుతుంది.
ఈ మూడు భూమికలు సామాన్య కోవకు చెందినవి. మిగిలిన నాలుగు జ్ఞానకోటికి
చెందినవి. పై మూడింటి కొరకు సగుణ బ్రహ్మ చింతన చేయాలి. ఇవి సిద్ధించిన పిదప అవిద్య నశిస్తుంది. నాలుగవ భూమిక ‘సఖాపత్తి’. దీనికి చెందిన పురుషులు ‘బ్రహ్మవిద్’ అవుతారు. ఐదవ భూమిక ‘అనాసక్తి’. చిత్తమునందు పరమానందం, నిత్య బ్రహ్మాత్మ భావం, సాక్షాత్కార రూపమైన చమత్కారమే అనాసక్తి అవుతుంది. ఇక ఆరవది ‘పదార్థ భావన భూమిక’. పదార్థములందు దృఢమగు అవిశ్వాస స్థితి ఏదైతే వున్నదో దానిని పదార్థ భావన అంటారు. దీనిలో దేహధ్యాస వుండదు. చివరకు ఉన్మాద స్థితి కలుగుతుంది.
చివరగా ఏడవది ‘తుర్యగా భూమిక’. ఏ స్థితిలో పురుషుడు పరమాత్మను ఆత్మస్వరూపంగా భావిస్తాడో అదే తుర్యగా అంటారు. మీరు పరమాత్ములు. జగత్కల్యాణం కొరకు
మీరు అవతరించారు. మీరు లీలలను చూపిస్తూ వుంటారు. మీ పావన నామం చేత జీవుని మనస్సు బాగుపడుతుంది. శ్రీరామా! తండ్రి పుత్రుల సంబంధం నిజమైనది కాదు. జీవేశ్వరుల సంబంధం నిజమైనది. శరీరం ఉన్నంతవరకూ వ్యవహారం కొనసాగించవలసి ఉంటుంది. భగవంతుని విస్మరించడం మహాపాపం. వ్యవహారం పవిత్రంగా ఉన్నప్పుడే భక్తి స్థిరపడుతుంది. దృష్టిలో భగవంతుని ఉంచుకొంటే ఆచరణ భక్తిమయమవుతుంది. మనస్సుతో భగవత్ స్మరణ చేస్తూ వుండాలి. భక్తికి అంతం లేదు. మన జీవితంలో ప్రతి వ్యవహారం భక్తి మయ మగునట్లుగా జీవించాలి. ఈశ్వరుని ప్రేమించే వాని కర్మలన్నీ పూజా స్వరూపమే అవుతాయి.
సత్పురుషులు మౌనంగా వుండి ఉపదేశం చేస్తారు. వారి ఆచరణ ప్రజల మనస్సులలో భక్తిని - జ్ఞానాన్ని కలు గజేస్తుంది. శ్రీరామునికి వశిష్ఠ ముని అందించిన దివ్య సందేశం విని దశరథునికి ఆనందం కలిగింది. ‘మీ ఆజ్ఞ అయిందా’ అని శ్రీరాముడు తండ్రిని అడుగుతాడు. దశరధుడు రాముడిని ”విశ్వామిత్రుని యాగ సంరక్షణకు వెళ్తావా?” అని అడిగితే రాముడు వెంటనే మీరెలా ఆదే శిస్తే అలానే చేస్తాను అన్నాడు. వశిష్ఠుడు ఆనందంతో శ్రీ రాముని పలుకులు విని ఎంతో ఆనందించాడు. ఆశీర్వదించి పంపాడు. సత్పురుషుల సాంగత్యంలోనే మేలు కలుగుతుంది. సుఖసంతోషాలు పొందుతారు. తన ఉప దేశం ఫలించినందులకు ఎంతగానో ఉప్పొంగిపోయాడు వశిష్ఠ మహర్షి.
Comments
Post a Comment