అమావాస్య కు ఆ పేరు ఎలా వచ్చింది ?

*అమావాస్య కు ఆ పేరు ఎలా వచ్చింది ?*

మానవుడు తాను చేసిన పాపుణ్యాల ఆధారంగా నరక స్వర్గ లోకాలు ప్రాప్తిస్తాయి.
 స్వర్గం చేరటానికి అనేక ద్వారాలు దాటు కుంటూ వెళ్లాలి.
 కొన్ని మన పుణ్య కార్యాల వలన మన పాపాలను కడుక్కుంటూ స్వర్గం వైపు వెళుతుంటాం. 
మన మరణం తరువాత ఆత్మ పూర్తిగా స్వర్గాన్ని చేరలేదు. వారి పాపాలు కడగటానికి వారి సంతానం శ్రాద్ధ కర్మాదులు నిర్వహించి వారిని పాప విముక్తులను చేయాలి. 

*దీనికి సంబంధించి మత్స్య పురాణం లో ఓ కధ ఉన్నది!!*
 అసలు అమావాస్య కి శ్రాద్ధ కర్మలకు గల సంబంధం వివరించబడింది.

ప్రతిమాసంలోను వచ్చే అమావాస్య అన్నా, మహాలయ అమావాస్య అన్నా పితృదేవతలకు ఎంతో ఇష్టమని, ఆ రోజున శ్రాద్ధ కర్మాదులను చేస్తే మంచి ఫలితం ఉంటుందని పెద్దలంతా అంటుంటారు. 
పితృదేవతలు ఏడుగణాలుగా విభజించపడ్డాయి. 
వీరిలో మూడు గణాలవారికి ఆకారం ఉండదు. 

వైరాజులు, అగ్నిష్వాత్తులు, బర్హిషదులు అనేవారికి ఇలా ఆకారం ఉండకపోవడం విశేషం. 

అలాగే సుఖాలినులు, హవిష్మంతులు, ఆజ్యపులు, సోమపులు అనే నాలుగు గణాలకు ఆకారం ఉంటుంది.

ఈ ఏడుగణాలవారూ ప్రాణులందరిలో అమితమైన సామర్థ్యాన్ని, చైతన్యాన్ని కలిగిస్తుంటారు. 

అందుకే ఈ పితృదేవతలకు కావల్సిన శ్రాద్ధవిధులను నిర్వర్తించాలని అంటారు.

 మూర్తి (ఆకారం) లేని పితరులు వైరాజుడు అనే ప్రజాపతి కుమారులు. అందుకే వీరిని వైరాజులు అని అంటారు. 

ఈ అమృతాలైన పితృగణాలవారు శాశ్వతాలైన లోకాలను పొందగోరి ఓసారి యోగసాధనకు ఉపక్రమించారు. 
అయితే ఏకాగ్రత లోపించి యోగం కోల్పోతారు. 
ఈ కారణంగా వీరంతా పితృదేవతలుగా మారారు. 
ఈ పితృదేవతల మానసపుత్రికే మేన. 
ఈమె హిమవంతుడిని పెళ్లాడింది, హిమవంతుడికి మైనాకుడు అనే కుమారుడు జన్మించాడు. మైనాకుడికి క్రౌంచుడు జన్మించాడు. 
ఆ క్రౌంచుడి పేరుమీదనే క్రౌంచద్వీపం ఏర్పడింది. 
మేనా హిమవంతులకు ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు. ఉమ, ఏకపర్ణ, అపర్ణ అని ఆ ముగ్గురు కుమార్తెల పేర్లు. 
ఆ కన్యలు మంచి యోగసిద్ధి కలవారు. 
హిమవంతుడు ముగ్గురిలో పెద్దదైన ఉమను రుద్రుడికి, ఏకపర్ణను భృగువుకు, అపర్ణను జైగీషవ్యుడికి ఇచ్చి వివాహం చేశాడు. 
ఇలా వైరాజ పితృదేవతల సంతతి వృద్ధి చెందింది. 
సోమపథాలు అనే లోకాలలో మరీచి అనే ప్రజాపతికి జన్మించిన పితృదేవతా గణాలు నివసిస్తుంటాయి.

ఈ పితృదేవతలకు ఒక మానస పుత్రిక ఉంది. 
ఈమె పేరుమీదనే అనంతర కాలంలో అమావాస్య తిథి వచ్చింది. 
ఈమె జీవనకథనంలో నేటివారికి ఉపయుక్తమయ్యే ఓ సందేశం కూడా ఇమిడివుంది.

అగ్నిష్వాత్తుల మానసిక పుత్రిక పేరు అచ్చోద. 
ఆమె నదీరూపంగా ఉండేది. అచ్చోదను పితృదేవతలు ఒక సరస్సులో సృష్టించారు, ఓరోజున వారంతా కలిసి ఆమె దగ్గరకు వచ్చారు. ఏదైనా వరం కోరుకోమని తమ కూతురును అడిగారు. 

అయితే దివ్యపుష్పమాలికలు, దివ్యగంధాలు, మంచి అలంకారాలు చేసుకుని ఎంతో సుందరాకృతిలో ఉన్న మావసుడు అనే ఒక పితరుని చూసి అచ్చోద కామపరవశురాలైంది. 

ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి తండ్రి అయిన మావసుడినే కోరిన కారణంగా ఆమె అప్పటిదాకా సంపాదించిన యోగశక్తి అంతా నశించింది. 
దాంతో ఆమె తన దివ్యత్వాన్ని కోల్పోయింది, అసంబద్ధంగా ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి ప్రవర్తించినందువల్లనే ఆమెకు ఇంతటి నష్టం ప్రాప్తించింది.

 పితృదేవతలు అచ్చోద తమకు ఎంతో అభిమానపాత్రురాలైన మానసపుత్రికే అయినా ధర్మాన్ని అనుసరించి శిక్ష విధించడంలో… అంటే ఆమెకు దివ్యత్వం నశించాలని శపించడంలో వెనుకాడలేదు. మావసుడు మాత్రం అచ్చోదను కామించక ఇంద్రియ నిగ్రహంతోనే ప్రవర్తించాడు.
 అచ్చోద మావస్య కాలేదు, అంటే మావసుడికి ప్రియురాలు కాలేదు. అందుకే ఆమె అమావస్య అయింది. అమావస్య అంటే మావసుడికి ప్రియురాలు కానిది అనేది ఇక్కడి అర్ధం. 
అలా తదనంతర కాలంలో అచ్చోదకే అమావాస్య అనే పేరు ప్రాప్తించింది. ఈమె అంటే పితృదేవతలకు ఎంతో ప్రాణం. 
తమ మానస పుత్రిక మీద ఉండే మమకారంతో అచ్చోద అమావస్య (అమావాస్య తిథి) అయిన రోజున తమకు ఎవరైనా అర్పించిన శ్రాద్ధానికి అనంత ఫలితాన్ని ఆనాటి నుంచి పితృదేవతలు ఇస్తూ వచ్చారు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

KAPU SURNAME AND GOTRALU:

శ్రీ లలిత దేవి చరిత్ర Part-12