దేవకి ఆరుగురు పుత్రులు.

దేవకి ఆరుగురు పుత్రులు.



జాజిశర్మ గారు


భాగవతములో ఆకాశవాణి కంసుని హెచ్చరించి ఆరుగురు శిశువుల మరణానికి కారణం ఎందుకు అయింది?

దీనికి భాగవతములో సమాధానము ఎక్కడా లేదు. వేరే ఏదైనా పురాణాలలో ఎక్కడైనా ఉందా అన్న ప్రశ్నకు సమాధానమే ఈ వివరణ. 

కంసుడు పూర్వజన్మలో కాలనేమి. సీతారాముల ఎడబాటుకి, రామరావణ యుద్ధానికి కారణమైన మారీచుడి కొడుకు పేరు కాలనేమి.

రామ రావణ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇంద్రజిత్తు ధాటికి లక్ష్మణుడు మూర్ఛపోతే హనుమంతుడు మూలిక బదులుగా సంజీవని పర్వతాన్నే తీసుకువచ్చి మూర్ఛనుంచి తేర్చాడు. మరోసారి మళ్ళీ యుద్ధంలో లక్ష్మణాదులు మూర్ఛపోతే ద్రోణగిరిపై ఉన్న విశల్యకరణి అనే మూలిక తేవాలని జాంబవంతుడు చెప్తే తాను తెస్తానని హనుమంతుడు సిద్ధ పడ్డాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నాడు రావణాసురుడు. రావణాసురుడు కాలనేమి ఇంటికి వెళ్ళి హనుమంతుడు ద్రోణగిరికి బయలుదేరుతున్న విషయం చెప్పి హనుమంతుడిని దారితప్పించి అక్కడ ఉన్న మాయాసరస్సులో స్నానం చేసేలా చేయమని ఆజ్ఞాపిస్తాడు. ప్రభువు ఆజ్ఞ శిరసావహించాడు కాలనేమి. ద్రోణగిరికి మార్గం వెతుకుతూ దప్పికగొన్న హనుమకు జపంచేస్తూ మహర్షిరూపంలో కాలనేమి కనిపించాడు. ద్రోణగిరికి మార్గం చెప్పమని హనుమ అభ్యర్థించాడు. అక్కడ ఉన్న సరస్సులో నీరు త్రాగి, స్నానం చేస్తే దప్పికతీరి, కార్యసాధనకు శక్తి వస్తుందని కాలనేమి తన శిష్యులద్వారా నమ్మించాడు. హనుమ ఆ కొలనులోకి దిగగానే మొసలి రూపంలో ఉంటూ శాపగ్రస్త అయిన ధాన్యమాలిని అనే అప్సరస అతనిని పట్టుకుంది. మహా బలశాలి అయిన హనుమ దానిని చంపి శాపవిమోచనం కలిగించాడు. అందుకు కృతజ్ఞతతో ధాన్యమాలిని కాలనేమి దురాలోచన వివరించి ద్రోణగిరికి దారి చెప్తుంది. హనుమంతుడు కాలనేమి ఆశ్రమానికి తిరిగివస్తాడు. సహాయం చేసినందుకు గురుదక్షిణ కోరుకున్న కాలనేమిని యమపురికి పంపిస్తాడు హనుమంతుడు.

 ఇది కాలనేమి కథ. వేషాలు మార్చి, మాయచేసే దొంగభక్తులు చేసే పూజాపునస్కారాలను కాలనేమి జపం అనడం తెలుగు జాతీయంగా మారింది. కంసుడు కృష్ణుడి మేనమామ. ఉగ్రసేనుని తొమ్మిది మంది కుమారులలో పెద్దవాడు. కృష్ణుడి చేత చంప బడతాడు. కంసుడు పూర్వజన్మలో కాలనేమి. ఈ జన్మలో కాలనేమిని విష్ణువు హతమారుస్తాడు. దేవకీ పుత్రులలో ఆరుగురు గత జన్మలో కాలనేమి పుత్రులు. వారిని తండ్రే చంపుతాడు అని హిరణ్య కశిపుడు శపిస్తాడు. ఆవిధంగానే మరుసటి జన్మలో దేవకీ గర్భాన మొదట పుట్టిన ఆరుగురిని కంసుడు చంపుతాడు. కాలనేమి పుత్రుల పేర్లు – హంస, సువికర్మ, కృత, దమన, రిపుర్మర్దన, క్రోధహంత. ఈ విధంగా హిరణ్యకశ్యపుని శాపం నిజం కావాలన్నా, కాలనేమి చేతిలో అతని సంతానం హతం కావాలన్నా, దేవకీ వసుదేవులను బంధించడం, వారికి జన్మించిన కాలనేమి పుత్రులను ఆరుగురునీ కంసుని చేతిలో హతంచేయించడం జరగాలన్నా ఆకాశవాణి పలకటం దేవకీ వసుదేవులను సంతానప్రాప్తి పర్యంతం ఖైదులో ఉంచడం తప్పనిసరిదేవకీ వసుదేవులు సంతోషంగా ఉంటూ ఉండగా వారికి మొట్టమొదట కొడుకు పుట్టాడు. పుట్టిన కొడుకును పుట్టినట్లుగా పట్టుకువెళ్ళి కంసునికి ఇచ్చేశాడు. వసుదేవుని చూసి ‘బావా, చూశావా నువ్వు ఎంత మాట తప్పని వాడవో! పిల్లవాడు పుట్టగానే నీవే తీసుకు వచ్చి ఇచ్చావు. నాకు అందుకే నీవంటే అంత గౌరవం. నువ్వు మాట తప్పని వాడవు. కానీ బావా, ఎనిమిదవ వాడు కదా నన్ను చంపేది! మొదటి వాడిని చంపడమెందుకు? తీసుకువెళ్ళిపో’ అన్నాడు. వసుదేవుడు పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయాడు. రెండవ కొడుకు పుట్టాడు. ఎనిమిదవ గర్భమును కదా ఇమ్మన్నాడు. అందుకని రెండవ పిల్లవానిని తీసుకు వచ్చి యివ్వలేదు. ఇలా ఆరుగురు పిల్లలు పుట్టారు. ఆ ఆరుగురు పిల్లలతోటి అమ్మకి, నాన్నకి మిక్కిలి అనుబంధం ఏర్పడింది. ఇంత అనుబంధంతో వాళ్ళు సంతోషంగా ఉన్న సమయంలో ఒకరోజున కంసుని దగ్గరికి నారదుడు వచ్చాడు. ఆయన మహాజ్ఞాని. ఎప్పుడు వచ్చినా ఏదో లోకకళ్యాణం చేస్తాడు. కంసుని దగ్గరకు వచ్చి ‘కంసా! ఎంత వెర్రివాడవయ్యా! అసలు నీవు ఎవరిని వదిలిపెడుతున్నావో వారెవరూ మనుష్యులు కారు. నువ్వు క్రిందటి జన్మలో ‘కాలనేమి’ అను పేరు గల రాక్షసుడవు. నిన్ను శ్రీమహావిష్ణువు సంహరించారు. నీ తండ్రి, తల్లి, దేవకీ, వసుదేవుడు, పక్క ఊళ్ళో ఉన్న నందుడు, ఆవులు, దూడలు వీరందరూ దేవతలు. నిన్ను చంపడానికే వచ్చారు’ అని చెప్పి ఆయన హాయిగా నారాయణ సంకీర్తనం చేసుకుంటూ ఊర్ధ్వలోకములకు వెళ్ళిపోయాడు.ఇపుడు కంసుడికి అనుమానం వచ్చింది. నారదుడు అనవసరంగా అబద్ధం చెప్పడు కదా! వసుదేవుడిని ఆరుగురి పిల్లలను తీసుకురమ్మనమని కబురుచేశాడు. ‘ఎనిమిదవవాడికి వీళ్ళు సహాయ పడితే నా బ్రతుకు ఏమయిపోవాలి? అందుకని ఉన్నవాళ్ళను ఉన్నట్లుగా సంహరించాలి’ అనుకుని పిల్లలను చంపేశాడు. తరువాత తన తల్లిని, తండ్రిని, దేవకిని, వసుదేవుని అందరినీ కారాగారంలో పెట్టి బకుడు, తృణావర్తుడు, పూతన – ఇలాంటి వారినందరినీ పిలిచి వాళ్ళతో స్నేహం చేశాడు. తరువాత వస్తున్న గర్భం ఏడవ గర్భం. కాబట్టి జాగ్రత్త పడిపోవాలని దేవకీ వసుదేవులను అత్యంత కట్టుదిట్టమయిన కారాగారంలో పెట్టాడు. రోజూ తానే వెళ్ళి స్వయంగా చూస్తుండేవాడు. ఇక్కడ మీకు ఒక అనుమానం రావాలి. వసుదేవుని పిల్లలు పసివారు. నారదుడు మహానుభావుడు. లోకకళ్యాణకారకుడు. ‘నారం దదాతి యితి నారదః’ అని ఆయనిష్కారణంగా జ్ఞానం ఇచ్చేవాడు. అటువంటి వాడు ఆరుగురు పిల్లలు చచ్చిపోవడానికి ఎందుకు కారకుడు అయ్యాడు? ఇపుడు వచ్చి ఆయన చెప్పకపోతే వచ్చిన నష్టం ఏమిటి? కంసునితో ఎందుకు అలా చెప్పాడు అని అనుమానం వస్తుంది. భాగవతంలో దీనికి ఎక్కడా జవాబు లేదు. దీనికి పరిష్కారం దొరకాలంటే దేవీభాగవతం చదవాలి. దేవీ భాగవతంలో ఈ రహస్యమును చెప్పారు.పూర్వం మరీచి, ఊర్ణాదేవి అని యిద్దరు ఉండేవారు. వాళ్ళిద్దరికీ ఆరుగురు పిల్లలు పుట్టారు. వాళ్ళు పుట్టుకతో బ్రహ్మజ్ఞానులు. వీళ్ళు ఆరుగురు ఒకసారి చతుర్ముఖ బ్రహ్మగారి సభకు వెళ్ళారు. వాళ్ళు బ్రహ్మగారు కూర్చుని ఉండగా నిష్కారణంగా ఒక నవ్వు నవ్వారు. అపుడు బ్రహ్మగారు ‘మీరు రాక్షసుని కడుపున పుట్టండి’ అని శపించారు. అందువలన వారు ఆరుగురు క్రిందటి జన్మలో ‘కాలనేమి’కి కుమారులుగా జన్మించారు. అలా కాలనేమి పుత్రులుగా కొంతకాలం బ్రతికి తదనంతరం హిరణ్యకశిపుని కడుపునా పుట్టారు. అప్పటికి వాళ్ళకి వున్న రజోగుణ తమోగుణ సంస్కారం తగ్గింది. మరల బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. బ్రహ్మగారు వారికి దీర్ఘాయుర్దాయమును ప్రసాదించారు. ఈవిషయమును వారు తండ్రి అయిన హిరణ్యకశిపునకు చెప్పారు. అపుడు హిరణ్యకశిపునికి కోపం వచ్చింది. ‘నేను యింకా తపస్సు చేసి దీర్ఘాయుర్దాయమును పొందలేదు. మీరు అప్పుడే పొందేశారా?కాబట్టి మిమ్మల్ని శపిస్తున్నాను. మీరు దీర్ఘనిద్రలో ఉండి మరణించండి. అంతేకాకుండా వచ్చే జన్మలో పుట్టినప్పుడు గతజన్మలో తండ్రి ఆ జన్మలో మిమ్మల్ని చంపుతాడు’ అన్నాడు. వాళ్ళు దీర్ఘ నిద్రలో ఉండి చచ్చిపోయారు. మరుజన్మలో మరీచి ఊర్ణల కొడుకులు ఇప్పుడు దేవకీదేవి కడుపునా పుట్టారు. వాళ్ళ శాపం ఈజన్మతో ఆఖరయిపోతుంది. వీళ్ళు యిప్పుడు గతజన్మలోని తండ్రి చేతిలో చచ్చిపోవాలి. గతజన్మలో వీరి తండ్రి కాలనేమి. కాలనేమి యిపుడు కంసుడిగా ఉన్నాడు. కాబట్టి వేరు కంసుడి చేతిలో మరణించాలి. వారికి ఆ శాప విమోచనం అయిపోయి వారు మరల బ్రహ్మజ్ఞానులు అయిపోవాలి. అందుకని నారదుడు వచ్చి వాళ్ళు శాప విమోచనం పొందేలా చేశాడు. అదీ నారదుని రాకలో గల కారణం. ఇది దేవీ భాగవతాంర్గతం.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: