మాయ - మర్మం

మాయ - మర్మం

'జాతస్య హి ధ్రువో మృత్యుః' అంటుంది మన భగవద్గీత. 

“ జాతస్య హి ధ్రువో మృత్యుః 
ధ్రువం జన్మ మృతస్య చ |

తస్మాదపరిహార్యే உర్థేన త్వం 
శోచితుమర్హసి || ”

“ పుట్టినవానికి మరణం తప్పదు; మరణించినవానికి పుట్టుక తప్పదు; తప్పించుకోవడానికి 
వీలులేని ఈ విషయంలో నువ్వు దుఃఖించడం తగదు. ”

పుట్టినవాడు గిట్టక తప్పదని దీని సారాంశం. మరి మన తలరాత ఎలా ఉందో చూద్దాం. పుట్టటం నుంచి గిట్టడం దాకా ఈ 'మాయ' మర్మాన్ని కొద్దిగా తెలుసుకుందాం. ఈ విశ్వాన్ని ఇంగ్లీషులో యూనివర్స్‌ అంటున్నాం. యూని అంటే ఒకటి, వర్స్‌ అంటే అనేకం. ఏకం, అనేకం కలిసి యూనివర్స్‌ అయింది. అనేక రూపాలలో కనిపించేదంతా ఒక్కటే అని ఈ విశ్వాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ బ్రహ్మాండానికీ పిండాండానికీ తేడా ఏమీ లేదు. మనం పిండాండం నుంచి వచ్చాం కాబట్టి దీని గురించి తెలుసుకుందాం. మనిషి శరీరంలో 72 శాతం నీరు ఉంది. వెన్నెముక నుంచి అన్ని వైపులకూ 72 వేల నాడులు ఉన్నాయి. వీటిలో 14 నాడులను ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ 14 నాడులకూ పాడ్యమి నుంచి చతుర్దశి వరకు ఉన్న 14 తిథులకూ సంబంధముంది. తిథి అంటే నక్షత్రంలో సగం. శుక్ల పక్షంలోని 14 తిథులు, కృష్ణ పక్షంలోని 14 తిథులు కలిపితే 28 నక్షత్రాలు అవుతాయి. మన నక్షత్రాలు 27 అయినా అభిజిత్‌తో కలిపి 28 కదా! మాయ అంటే మనమెవరో తెలియకపోవడం. ఒకటి అనేకం కావడమే సృష్టి. ఆ ఒక్కటిలో అన్నీ చేరడమే ప్రళయం. అదే మరణం కూడా.

మనిషి పుట్టుకకు మూలకారణం స్త్రీలకు ప్రతి నెలా జరిగే రుతువు (బహిష్టు). మనుషులలో ఈ బహిష్టు 27 లేదా 28 రోజులకు ఒకసారి జరుగుతుంది. ఈ బహిష్టు ప్రారంభమైన క్షణం నుంచి 24 గంటలు ఒకరోజు. అలాంటి 27 రోజులు లేదా 28 రోజులు ఒక నెల. నెల అంటే చంద్రుడు అని కూడా అర్థం ఉంది. నెలరాజు, నెలపొడుపు అనే పదాలు ఇలా ఏర్పడినవే. బహిష్టుకు 14 రోజుల ముందు అండం విడుదల అవుతుంది. ఈ అండం ఫలదీకరణం చెందితే పిండం గర్భాశయాన్ని చేరుతుంది. శిశుజననంతో రుతుచక్రం ఆగిపోతుంది. దీన్నే మనం నెలతప్పడం అంటుంటాం. భగవంతుడు తన శరీరంలో నాలుగో వంతు భాగంతో సృష్టిచేశాడని పురుషసూక్తం అంటోంది. కాలచక్రానికి సూర్యుడే ఆధారం. సావన సంవత్సరం అంటే 360 రోజులు. ఇదే రాశిచక్రంలోని 360 డిగ్రీలు. దీని ప్రకారం 360 రోజుల్లో నాలుగోవంతు 90 రోజులు అవుతుంది. ఈ 90 రోజులు పోగా 270 లేదా 280 (40 వారాలు) రోజుల్లో శిశువు జన్మిస్తుంది. 120 నెలలను పరమాయువు అంటారు. దీని ఆధారంగానే సూర్య సిద్ధాంతం రూపొందింది. ఉత్తరాషాఢ, శ్రవణాల మధ్య అభిజిత్‌ నక్షత్రం ఉంటుంది. ఈ 28 నక్షత్రాల ఆధారంగా హోరాశాస్రాన్ని పరాశరమహర్షి రూపొందించారు. సౌర అంటే 72, హోర అంటే 82. వీటిని తిరగేస్తే 27, 28 వస్తాయి. 27 నక్షత్రాల ఆధారంగా సూర్యసిద్ధాంతం, 28 నక్షత్రాల ఆధారంగా హోరాశాస్త్రం రూపొందాయి. అందువల్ల దీన్ని పరాశర హోరాశాస్త్రం అన్నారు. నక్షత్ర మానం ప్రకారం 27.321 రోజులు ఒక నెల. అలాంటి 12 నెలలు ఒక సంవత్సరం. అలాంటి 120 సంవత్సరాలు మనిషి ఆయువు. జ్యోతిష శాస్త్రం ప్రకారం దశలన్నీ కలిపితే 120 సంవత్సరాలు వస్తుంది. దీన్ని బట్టి మనిషి పూర్ణాయువు 120 సంవత్సరాలని అనుకోవలసి వస్తోంది.

120 సంవత్సరాలు బతకాల్సిన మనిషి అందులో సగం కూడా బతకడం లేదు ఎందుకు అనే ప్రశ్న చాలా మందిలో ఉదయిస్తుంటుంది. దీనికి కారణం మనిషి తీసే శ్వాసలే. ముఖ్యంగా మనిషి పూర్ణ శ్వాసలు తీయడం లేదు. అర్ధశ్వాసలతో కాలం గడిపేస్తున్నాడు. మనిషి నిమిషానికి తీసే శ్వాసలు 15. రోజుకు 1440 నిమిషాలు. 1440ని 15తో హెచ్చిస్తే 21,600 శ్వాసలు వస్తాయి. 12 రాశులు, 12 నెలలు, పూర్ణాయువు 120 సంవత్సరాలు, కలియుగం 1200 దివ్య సంవత్సరాలు, మహాయుగం 12000 దివ్య సంవత్సరాలు... ఇలా ఒకదానితో ఒకటి సంబంధం కనిపిస్తూనే ఉంటుంది. తక్కువ శ్వాసలు తీసే జీవి ఎక్కువ కాలం బతుకుతుంది. ఎక్కువ శ్వాసలు తీసే జీవి తక్కువ కాలం బతుకుతుంది. మనం యోగశాస్త్రాన్ని అభ్యసిస్తే పూర్ణాయువు సంపాదించుకోవడం పెద్ద కష్టం కాదు. మరణం అంటే శరీరం మార్పునకు లోనవడం. ఆత్మ ఈ శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకుంటుంది. కాబట్టి మరణం గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇక ఈ జన్మలో అనుభవిస్తున్న కర్మ ఫలితాల గురించి అంటారా... సత్కర్మ ఉన్న వారికి సరైన పరిహార క్రియలు తప్పనిసరిగా అందుబాటులోకి వస్తాయి. ఆ సత్కర్మ బలం లేనివారు ఎక్కడెక్కడో తిరుగుతూ వేల రూపాయల్ని పరిహార క్రియల పేరిట వదిలించుకుంటారు. అణువుకూ ఆత్మకూ తేడా ఏమీ లేదు. ఇదంతా సూర్యకాంతి శక్తి. మన జీవితాలన్నీ సూర్యకాంతి శక్తితో ప్రేరణపొంది నడుస్తున్నాయి. ఈ సూర్యకాంతే సృష్టి, స్థితి, లయలకు మూలం. ఈ అనంత సూర్య శక్తిని సాధించి మనమే పూర్తిగా సూర్యకాంతిగా మారి అందులోనే లయం కావాలని గాయత్రీ మంత్రం కూడా చెబుతోంది.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: